హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని నిజాం కాలేజీ హాస్టల్లో డిగ్రీ, పీజీ విద్యార్థినులకు సీట్లు కేటాయించినా ఇంకా 18 సీట్లు మిగిలాయి. నిజాం కాలేజీలో అత్యధికంగా అమ్మాయిలే చేరుతుండటంతో నాలుగంతస్తుల్లో 71 గదులతో 338 మందికి సరిపడేలా హాస్టల్ను నిర్మించారు. కొన్నేండ్లుగా పీజీ విద్యార్థులకు మాత్రమే హాస్టల్ వసతి కల్పిస్తున్నారు. కానీ, డిగ్రీ విద్యార్థినులకు మాత్రమే సీట్లు కేటాయించాలని కొన్ని విద్యార్థి సంఘాలు ఆందోళన చేశాయి. మానవతా దృక్పథంతో వ్యవహరించిన ప్రభుత్వం.. హాస్టల్లో 50 శాతం సీట్లను యూజీ, మరో 50 శాతం సీట్లను పీజీ విద్యార్థినులకు ఇస్తామని ప్రకటించింది. డిగ్రీ విద్యార్థుల నుంచి 184 మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఆలస్యంగా మరికొందరు దరఖాస్తులు సమర్పించారు. ఇలా 204 మంది డిగ్రీ విద్యార్థులు చేరారు. ఇంకా 134 సీట్లు మిగిలాయి. వీటిని పీజీ విద్యార్థులకు కేటాయించాలని అధికారులు నిర్ణయించారు. పీజీ ఫస్టియర్లోని 91, ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ కోర్సులోని మరో 25 మందికి సీట్లను కేటాయించారు. యూజీలోని 204, పీజీలోని 116 మొత్తం కలుపుకుంటే 320 మంది హాస్టల్లో వసతి పొందారు. మరో 18 సీట్లు ఖాళీగానే ఉన్నాయి. విద్యార్థుల సంఖ్యకు హాస్టల్ సరిపోదంటూ కొందరికే ఇవ్వాలన్న వాదనలు పూర్తిగా అబద్ధమని తేలింది. కొందరు విద్యార్థులను తప్పుదోవ పట్టించి పబ్బం గడుపుకున్నట్టుగా స్పష్టమైంది.