సిద్దిపేట ఆచార్య జయశంకర్ స్టేడియంలో క్రికెట్ సంగ్రామం
పాల్గొననున్న 230 జట్లు.. 3700 క్రీడాకారులు
టీ-10 మ్యాచ్లు
సిక్స్ కొట్టు ..రూ.వెయ్యి పట్టు
ప్రతి జట్టుకూ క్రీడా దుస్తులు
రోజుకు 8 డే అండ్ నైట్ మ్యాచ్లు
17న అట్టహాసంగా టోర్నీని ప్రారంభించనున్న మంత్రి హరీశ్రావు
సిద్దిపేట, ఫిబ్రవరి 12 : ‘సీఎం కేసీఆర్ క్రికెట్ టోర్నీ-2022’ సీజన్-2 మహా సమరానికి వేళైంది. ముఖ్యమంత్రి పుట్టినరోజును పురస్కరించుకొని మంత్రి హరీశ్రావు ఆధ్వర్యంలో ఏటా నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్న పోటీల షెడ్యూల్ విడుదలైంది. ఇందుకు సిద్దిపేటలోని ఆచార్య జయశంకర్ క్రికెట్ స్టేడియం సిద్ధమవుతున్నది. మెట్రో నగరాల తరహాలో రోజుకు 8 డే అండ్ నైట్ మ్యాచ్ల నిర్వహణకు సిద్దిపేట క్రికెట్ అసోసియేషన్ ఏర్పాట్లను చకచకా చేస్తున్నది. ఈ మ్యాచ్ల్లో సిక్స్ కొట్టిన ప్రతి బ్యాట్స్మెన్కు రూ.వెయ్యి చొప్పున నగదు ఇచ్చేందుకు నిర్ణయించారు. టీ-10 మ్యాచ్లకు దాదాపు 230 జట్లు పేర్లను నమోదు చేసుకోగా, 3700 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. టోర్నీ నిర్వహణకు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, విద్యార్థి, యువత విభాగం నాయకులతో సిద్దిపేట పట్టణంతో పాటు ప్రతి మండలాలకు ఇన్చార్జిలను మంత్రి హరీశ్రావు నియమించారు. ఈ టోర్నీని ఈ నెల 17న మంత్రి హరీశ్రావు ప్రారంభించనున్నారు.
సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని మంత్రి హరీశ్రావు ఆధ్వర్యంలో ఏటా నిర్వహించనున్న సిద్దిపేట ని యోజకవర్గ స్థాయి ‘సీఎం కేసీఆర్ టోర్నీ-2022’ రెండో సీజన్ క్రికెట్ మహా సమరానికి షెడ్యూల్ విడుదలైంది. పోటీలను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహించనున్నారు. ఈ టోర్నమెంట్లో సిద్దిపేట పట్టణంలో పాటు సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్, నారాయణరావుపేట, చిన్నకోడూర్, నంగునూర్ మండలాల నుంచి ప్రతి గ్రామం నుంచి క్రికెట్ జట్లు పాల్గొంటాయి. ఈ టోర్నీని ఈ నెల 17న మంత్రి హరీశ్రావు ప్రారంభించనున్నారు. నిత్యం పోటీలతో క్రీడా ప్రేక్షకులకు కునువిందు చేస్తున్న సిద్దిపేటలోని ఆచార్య జయశంకర్ క్రికెట్ స్టేడియంలో ఈ పోటీలు జిల్లా వాసులకు మరింత క్రీడా వినోదాన్ని పంచనున్నాయి. గతేడాది సిద్దిపేట పట్టణం, మండలాలకు వేరువేరుగా టోర్నమెంట్ నిర్వహించారు. గతంలో కాకుండా ఈ సారి సిద్దిపేట పట్టణంతో పాటు ఐదు మండలాలకు ఒకేసారి టోర్నీ జరుగనుంది. ఈ టోర్నీని మరింత పకడ్బందీంగా నిర్వహించేందుకు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, విద్యార్థి, యువత విభాగం నాయకులతో సిద్దిపేట పట్టణంతో పాటు ప్రతి మండలాలకు ఇన్చార్జిలను మంత్రి హరీశ్రావు నియమించారు.
టోర్నీకి చకచకా ఏర్పాట్లు..
సీఎం కేసీఆర్ క్రికెట్ టోర్నీ-2022 సీజన్-2 సిద్దిపేటలోని ఆచార్య జయశంకర్ స్టేడియం లో 17న ప్రారంభం కాగా, 18 తేదీ నుంచి పో టీలు జరుగుతాయి. టోర్నీ కోసం 3 టార్ప్ పిచ్లను సిద్ధం చేశారు. జాతీయస్థాయి ప్రమాణాలకు ఏమాత్రం తగ్గకుండా గ్రౌండ్ను పూర్తిస్థాయిలో పచ్చిక ఏర్పాటు చేశారు. ప్రేక్షకుల కోసం పెవిలియన్ సిద్ధ్దం చేశారు. ఆటగాళ్లు ప్రాక్టీస్ చేసుకునేందుకు 2 టార్ప్, 2అస్ట్రో టార్ప్ నెట్లు సిద్ధ్దం చేశారు.
230 జట్లు.. 3700 మంది క్రీడాకారులు
ఈ టోర్నీకి దాదాపు 230 జట్లు తమ పేర్లను నమోదు చేసుకున్నాయి. 3700 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు.ఈ పోటీల్లో పాల్గ్గొనే క్రీడాకారులకు మంత్రి హరీశ్రావు ఆకర్షణీయమైన రంగులతో కూడిన క్రీడా దుస్తులు అందించనున్నారు. ఆయా జట్లకు క్రీడా సామగ్రి అందించనున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చెంది న 4 అంపైర్లు, ఇద్దరు స్కోరర్లు, ప్రతి మ్యాచ్కు పిచ్ను సిద్ధ్దం చేసేందుకు 4 గ్రౌండ్మెన్స్తో పాటు సిద్దిపేట అసోసియేషన్కు చెందిన 5 సిబ్బంది పనిచేయనున్నారు.
జట్ల కూర్పు.. మ్యాచ్ల నిర్వహణ..
సీఎం కేసీఆర్ క్రికెట్ టోర్నీలో పాల్గొనే జట్ల క్రీడాకారులు సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన వారై మాత్రమే ఆడాలి. ఏ ఊరు ఆటగాడు ఆ ఊ రు జట్టులో, ఏ వార్డు ఆటగాడు ఆ వారుల్డోనే ఆ డాలి. జట్టులో ఆటగాళ్ల వయస్సు 35ఏండ్ల లోపు ఉండాలి. జట్టులో 35 ఏండ్ల పైబడి ముగ్గురు ఆటగాళ్లకు మాత్రమే అవకాశమిస్తారు.
డే అండ్ నైట్ మ్యాచ్లు..
మెట్రో నగరాలకు మాత్రమే సాధ్యమైన డే అండ్ నైట్ క్రికెట్ పోటీలు సిద్దిపేట యువతకు అందుబాటులోకి వచ్చాయి. దీనికోసం మంత్రి హరీశ్రావు స్టేడియంలో రూ.2.50 కోట్ల్లతో ఫ్లడ్లైట్లు ఏర్పాటు చేశారు. దీంతో ఇక్కడి క్రీడాకారు లు సైతం అంతర్జాతీయ క్రీడాకారుల మాదిరిగా డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్లు ఆడే సౌకర్యం అం దుబాటులోకి వచ్చింది. సీజన్ -1 మాదిరిగానే ఈ సీజన్లోనూ డే అండ్ నైట్మ్యాచ్లు నిర్వహించనున్నారు. తెల్ల బాల్తో డే మ్యాచ్లు, పింక్బాల్తో నైట్ మ్యాచ్లు నిర్వహించనున్నారు.
విజేతకు రూ. లక్ష బహుమతి.. ట్రోఫీ..
ట్రోఫీ గెలుపొందిన జట్టుకు రూ.లక్ష ప్రైజ్ మనీతో పాటు విన్నర్ ట్రీఫీని అందజేయనున్నారు. రెండో స్థానంలో నిలిచిన జట్టకు రూ.50 వేలు ట్రోఫీ బహూకరించనున్నారు. టోర్నీలోఅద్భుతంగా రాణించి మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా నిలిచిన ఆటగాడికి రూ. 25వేలు, ట్రీఫీని అందించనున్నారు. ప్రతి మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఆటగాడికి రూ.500, జ్ఞాపికను అందిస్తారు.
సిక్స్ కొట్టు వెయ్యి పట్టు…
ఈ టోర్నీలో సిక్స్లు కొట్టేవారిని ప్రోత్సహించేందుకు సిక్స్ కొట్టిన ప్రతి ఆటగాడికి రూ 1000 నగదు బహుమతిగా అందించనున్నారు. దీంతో బాట్స్మెన్స్ మరింత ఉత్సాహం లభించనున్నది. దీంతో మ్యాచ్లు రసవత్తరంగా జరిగి ప్రేక్షకులను అలరించే అవకాశం ఉంది.
ఏటా టోర్నీ నిర్వహిస్తున్నాం..
సీఎం కేసీఆర్ పుట్టినరోజు పురస్కరించుకొని ఏటా సిద్దిపేట మినీ క్రికెట్ స్టేడియంలో సిద్దిపేట నియోజకవర్గ స్థాయిలో డే అండ్ నైట్ క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నాం. గ్రామీణ స్థాయి క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నాం. ఈ టోర్నీలో ప్రతి గ్రామం నుంచి క్రీడాకారులు పాల్గ్గొనే విధంగా చూస్తున్నాం. క్రీడాకారులకు క్రీడా దుస్తులను అందిస్తున్నాం. క్రీడాకారులు ఈ టోర్నీలో ప్రతిభ చూపి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో ఆడే విధంగా ఎదగాలి.
మంత్రి సహకారంతో క్రికెట్ పోటీలు..
సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మంత్రి హరీశ్రావు సహకారంతో రెండేండ్లుగా సీఎం కేసీఆర్ టోర్నీ క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నాం. సిద్దిపేట క్రీడాకారులు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు ఇది మంచి వేదిక. మంత్రి హరీశ్రావు సిద్దిపేటలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో క్రికెట్ స్టేడియం నిర్మించారు. దీనిని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలి
– మల్లికార్జున్, సిద్దిపేట క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి