ములుగు ఉద్యానవన యూనివర్సిటీ వీసీ నీరజ ప్రభాకర్, ఉద్యానవన శాఖ కమిషనర్ వెంకట్రాంరెడ్డి
గజ్వేల్, ఫిబ్రవరి12: రియల్ ఎస్టేట్ వ్యాపారంతో కనుమరుగవుతున్న ద్రాక్ష తోటల పెంపకాన్ని ప్రోత్సహించి, మన ప్రాంతంలో పంటను కాపాడుకోవాలని సిద్దిపేట జిల్లా ములుగులోని కొండాలక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్ర ఉద్యానవన యూనివర్సిటీ ఉపకులపతి నీరజ ప్రభాకర్, ఉద్యానవన శాఖ కమిషనర్ వెంకట్రాంరెడ్డి అన్నారు. వర్సిటీలో శనివారం ఉద్యానవన శాఖ సహకారంతో ద్రాక్షపండ్ల తోటల విస్తీర్ణాన్ని పెంచాలన్న అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఉద్యానవన యూనివర్సిటీ వీసీ నీరజ ప్రభాకర్, ఉద్యానవన శాఖ కమిషనర్ వెంకట్రాంరెడ్డి, డాక్టర్ వైఎస్సార్ ఉద్యానవన యూనివర్సిటీ మాజీ ఉపకులపతి డాక్టర్ శిఖామణి, జాతీయ ద్రాక్ష పరిశోధన సంస్థ డైరెక్టర్ సోమ్కుమార్ పాల్గొని ద్రాక్ష తోటల అభివృద్ధిపై చర్చించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు పలు జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారంతో ద్రాక్షతోటల పెంపకం కనుమరుగవుతోందన్నారు. ద్రాక్షతోటలను పెంచడానికి రైతుల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పెంపకానికి రాష్ట్రంలో వాతావరణం, భూములు ఎక్కువ అనుకూలంగా ఉన్నాయన్నారు. తెలంగాణలో ద్రాక్ష పంటల్లో క్రిన్సన్ సడ్లన్, ఫ్లేమ్ సీడ్లెన్, శరద్ సీడ్లన్, సోనాహ రకాలకు మంచి మార్కెట్ ఉందని రైతులకు అవగాహన కల్పించారు. కొత్త రకాలను తెలంగాణలో సాగు చేయాలని రైతులకు వివరించారు. సదస్సులో నాబార్డు డీజీఎం సంతానం, అగ్రిహార్టీ సొసైటీ చైర్మన్ అనిల్ ఏపూరి, ఉద్యాన విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త భగవాన్, ద్రాక్షరత్న చింతల వెంకటరెడ్డి, వివిధ జిల్లాల ఉద్యానవన అధికారులు, విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు, వివిధ జిల్లాల్లో ద్రాక్ష సాగు చేస్తున్న రైతులు పాల్గొన్నారు.