సేంద్రియ ఎరువుల వినియోగం పెంచాలి
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జానకీశ్రీనాథ్
ఝరాసంగం, ఫిబ్రవరి15: అన్ని ప్రాంతాల రైతులు చిరుధాన్యాల సాగుకు ముందుకురావాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జానకీశ్రీనాథ్ అన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లాలోని ఝరాసంగం మండల పరిధిలోని మాచ్నూర్ గ్రామ శివారులో జరిగిన 22వ పాత పంటల జాతరకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చిరుధాన్యాల్లో ఎక్కువగా పోషకాలు ఉంటాయన్నారు. రైతులు విత్తనాలు నిల్వ చేసుకుని పంటలు సాగుచేస్తే నష్టం ఉండదన్నారు. రసాయన ఎరువుల వినియోగం తగ్గించి సేంద్రియ ఎరువుల వినియోగం పెంచాలన్నారు. సేంద్రియ ఎరువులతో పంటలు సాగు చేసే రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. డీడీఎస్ సంస్థలో చిరుధాన్యాలు పండించే మహిళా రైతులు 50వేల మంది ఉంటే పూర్వ వైభవం వస్తుందన్నారు. ఇప్పుడు ఎక్కువగా ఉన్నత వర్గాలవారు చిరుధాన్యాలు తింటున్నారని గుర్తుచేశారు. ఎడ్ల బండ్లను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం రైతులను ప్రోత్సహించాలని డీడీఎస్ జాయింట్ డైరెక్టర్ జయశ్రీ కోరారు. గ్రామాల్లో పశువులు లేక రైతులు యంత్రాలతో వ్యవసాయ పనులు చేస్తున్నారన్నారు. సేంద్రియ ఎరువులు తయారు చేయాలంటే పశువులు తప్పకుండా ఉండాలన్నారు. 22 ఏండ్లుగా పాత పంట ల జాతర నిర్వహిస్తున్నామని, దేవుళ్లు, ఎడ్లబండ్లు, విత్తనాలకు పూజలు చేస్తామన్నారు. చిరు ధాన్యాలతో ఆహార భద్రత ఉందన్నారు. జీవవైవిధ్య పంటలు సాగు చేస్తున్న మహిళా రైతులు చంద్రమ్మ, మంజుల, చుక్కమ్మను అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ జహీరాబాద్ భిక్షపతి, సంగారెడ్డి మండల వ్యవసాయాధికారి వైద్యనాథ్ సన్మానించారు. డీడీఎస్ ప్రతినిధులు జనరల్ నర్సమ్మ, బాలయ్య , నర్సమ్మ, చంద్ర మ్మ, వినయ్కుమార్, లక్ష్మమ్మ, పూలమ్మ పాల్గొన్నారు.