సెకండ్ వేవ్ ముగియలేదు.. థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉంది..
కరోనాపై నిర్లక్ష్యంగా ఉండొద్దని ప్రభుత్వాలు, వైద్యనిపుణుల హెచ్చరిక
శుభ ముహూర్తాలు, పండుగల వేళ జాగ్రత్తగా ఉండాలని సూచన
వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి అధికారుల అవగాహన కార్యక్రమాలు
మంచిర్యాల, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : మంచిర్యాల జిల్లాలో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నది. సెకండ్ వేవ్ ముగియలేదని కేంద్రం ప్రకటించడం.. థర్డ్ వేవ్ రూపంలో ప్రమాదం పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తుండడంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కాగా.. ఈ నెలంతా శుభ ముహూర్తాలు, పండుగలు ఉండడంతో వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అధికార యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. భౌతికదూరం పాటించాలని, మాస్క్, శానిటైజర్ తప్పనిసరిగా వాడాలని, వ్యాక్సిన్ తీసుకోవాలని సూచిస్తున్నది.
మంచిర్యాల జిల్లాలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతూనే ఉన్నది. రెండో దశ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వైద్య శాఖ హెచ్చరిస్తున్నది. ఈ నెల 9 నుంచి శ్రావణమాసం.., శుభ ముహూర్తా లు.., ఈ నెలలో పండుగలూ ఉండడంతో థర్డ్వేవ్ రూపంలో ప్రమాదం పొంచి ఉన్నది. వైరస్ వ్యాప్తిని నియంత్రించాల్సిన అవసరం ఉన్నదని పోలీస్ శాఖ సూచిస్తున్నది.
పెరుగుతున్న కేసులు.. అధికారుల హెచ్చరికలు..
లాక్డౌన్ ఎత్తివేసిన వారం రోజులు కేసులు తగ్గినా, ప్రజల నిర్లక్ష్యంతో క్రమంగా పెరుగుతున్నది. సెకండ్వేవ్ తగ్గుముఖం పట్టిందని ప్రజలు విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతున్నారు. కొం దరు మాత్రమే పకడ్బందీగా మాస్కులు వాడుతున్నారు. థర్డ్ వేవ్ రూపంలో ప్రమాదం పొంచి ఉన్నదని, జాగ్రత్తగా ఉండాలని సర్కారు, అధికార యంత్రాంగం పదేపదే సూచిస్తూనే ఉ న్నది. కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఇందుకు అర్హులందరూ టీకా తీసుకోవాలని సూచిస్తున్నది.
పండుగల సీజన్.. పొంచి ఉన్న ప్రమాదం..
ఈ నెల 9న శ్రావణమాసం ప్రారంభం కానుండడం.., శుభ ముహూర్తాలు అధికంగా ఉండడంతో రోడ్లపైకి, దుకాణాలకు ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. గతంలో అవసరం మేరకు దుకాణాలకు వెళ్లడంతో పాజిటివ్ కేసులు తగ్గాయి. ప్రస్తుతం విచ్చలవిడిగా ప్రయాణాలు చేస్తున్నారు. ప్రతి ఫంక్షన్కూ హాజరవుతున్నారు. మార్కెట్లలో భౌతిక దూరం పాటించకపోవడంతో జిల్లాలో రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో మున్సిపల్, పోలీస్ శాఖలు సంయుక్తంగా జాగ్రత్త చర్యలు చేపడుతున్నాయి. థర్డ్వేవ్ పొంచి ఉందని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. శ్రావణ సోమవారం, మంగళవారం, శుక్రవారాల్లో ఆలయాలకు వెళ్లేటప్పుడు భౌతిక దూరం పాటించాలని, మాస్కు, శానిటైజర్ వాడాలని సూచిస్తున్నారు. ఈ నెలలోనే మొహర్రం, రాఖీ పౌర్ణమి, కృష్ణాష్టమి, మంగళగౌరీ వ్రతం, సెప్టెంబర్ 5న టీచర్స్ డే వంటి పండుగలు, కార్యక్రమాలు ఉన్నాయని, సామూహిక దూరం పాటించకపోతే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు.