వనపర్తి, వనపర్తి టౌన్/అక్టోబర్ 26: తెలంగాణ రాష్ట్ర సాధకుడు, ప్రగతి ప్రదాత సీఎం కేసీఆర్ రాకతో వనపర్తి పట్టణం పులకించిపోయింది. వనపర్తి పట్టణంలో ఎటు చూసినా బీఆర్ఎస్ ప్రభంజనం కనిపించింది. గురువారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ విజయవంతమైంది. పల్లె, పట్నం తేడా లేకుండా నియోజకవర్గ వ్యాప్తంగా ఆరలక్ష మందికి పైగానే జనం తరలివచ్చారు. బస్సులు, ఆటో, ట్రాక్టర్లల్లోనే కాకుండా పాదయాత్రగా బీఆర్ఎస్ పార్టీశ్రేణులు తరలివచ్చారు. పట్టణ ప్రధాన కూడళ్లన్నీ గులాబీమయంగా మారాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గులాబీ జెండాలు పట్టుకొని బైక్ ర్యాలీలు తీశారు. బ్యాండ్లతో ఊరేగింపుగా వచ్చారు. దీంతో సభా ప్రాంగణం అంతా జనసందోహంగా మారింది. ఈలలు, కేరింతలతో హోరెత్తించారు. జై కేసీఆర్.. జై తెలంగాణ.. జై ఎస్ఎన్ఆర్, నీళ్ల నిరంజన్రెడ్డి, రావుల అన్న నినాదాలతో మార్మోగాయి.
సీఎం కేసీఆర్ హెలికాప్టర్లో జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానం వెనక భాగంలోకి చేరుకొగానే జనం గులాబీ జెండాలు, కండువాలు చేతబూని స్వాగతం పలికారు.
సభలో కళాకారులు కంచిరావుపల్లి నాగరాజు ఆధ్వర్యంలో మానుకోట ప్రసాద్, మధుప్రియ పాటలతో జనాన్ని ఆలరించారు. వీరి పాటలతో అలరించినంత సేపు మహిళలు పెద్దఎత్తున్న కోలాటం, జెండాలను ఎత్తి డ్యాన్సులు చేశారు. మధుప్రియ రాబంధుల రాజ్యం కావాలా… రైతు బంధు రాజ్యం కావాలన్న అన్నప్పడు కేసీఆర్ రాజ్యం కావాలని మహిళలు ఒరెత్తి నినదించారు. సీఎం కేసీఆర్ సభా వేదిక పైకి చేరుకొగానే సభలో పెద్ద ఎత్తున నినాదాలు..హర్షధ్వానాలతో సభా ప్రాంగణం మార్మోగింది. యువత పెద్ద ఎత్తున సీఎం కేసీఆర్ నాయకత్వం వర్థిల్లాలి.. నీళ్ల నిరంజన్రెడ్డి జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. సభ ప్రాంగణంతో పాటు కనుచూపు మేర జనంతో కిక్కిరిసిపోయింది. సీఎం కేసీఆర్కు ప్రజలకు అభివాదం చేస్తూ సభా వేదిక పైకి చేరుకున్నారు. ఈ సందర్భంగా వనపర్తి నీళ్ల నిరంజన్రెడ్డి తో పాటు మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్రెడ్డి పలువురు నాయకులు కేసిఆర్ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. గోపాల్శర్మ సీఎం కేసీఆర్కు శాలువా కప్పారు, అలాగే మైనార్టీ నాయకుడు సర్ధార్ఖాన్ సీఎం కేసీఆర్కు దట్టి కట్టారు. అనంతరం సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నాగం తిరుపతి రెడ్డికి బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
వనపర్తిలో జరిగిన ప్రజాఆశీర్వాద సభ నేపథ్యంలో పోలీసులతో భారీ బందోబస్తు కల్పించారు. ఎస్పీ పర్యవేక్షణలో ప్రత్యేక భధ్రత ఏరాటు చేశారు. హెలిప్యాడ్, సభా ప్రాంగణం, సభావేదిక, వీఐపీ, మీడియా గ్యాలరీ, పార్కింగ్ ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు చేశారు.సభా వేదిక పై పాసులు ఉన్న నాయకులకు మాత్రమే అనుమతించారు.
వనపర్తి టౌన్, అక్టోబర్ 26: వనపర్తి జిల్లా కేంద్రం గురువారం జనపర్తిగా మారింది. బీఆర్ఎస్ అభ్యర్థిని బలపరుస్త్తూ నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజాఆశీర్వాద సభ సక్సెస్ అయ్యింది. నియోజకవర్గంలోని వనపర్తి, పెబ్బేర్, మున్సిపాలిటీల పరిధితోపాటు రేవల్లి, ఏదుల, గోపాల్పేట, ఖిల్లాఘణపురం, పెద్దమందడి, శ్రీరంగాపురం మండలాలు, గ్రామాల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు కదం తొక్కారు. ఆటోలు, బస్సులు, తుఫానులు, ప్రైవేట్ బస్సులు, బైకులపై గ్రామాల నుంచి తరలివచ్చారు. కొత్తకోట రోడ్డు, ఖిల్లాఘణపురం, పాన్గల్, పెబ్బేర్ రోడ్డు నలువైపుల నుంచి బీఆర్ఎస్ గొడుగులు, క్యాప్లు, కండువాను ధరించి సభకు రావడంతో సభా ప్రాంగణమంతా జనసంద్రంగా నిలిచింది. వార్డులు, గ్రామాల నుంచి డప్పు వాయిద్యాలు, యాదవుల డోలు, ప్లకార్డులు చేతపట్టుకొని నృత్యాలు చేస్తూ పటాకులు కాలుస్తూ సభకు తరలివచ్చారు. యువకులు, మహిళలు బ్యాండ్ మేళాలకు కేరింతలు కొడుతూ నృత్యాలు చేశారు. బతుకమ్మ, బంజారా నృత్యాలతో సభా ప్రాంగణానికి మహిళలు చేరుకున్నారు. సభాప్రాంగణంతోపాటు రహదారిపై ఎల్ఈడీ ఏర్పాటు చేసి ధూంధాం, సభ సందేశాన్ని నిల్చొని అలకించారు.