నాగర్కర్నూల్, ఏప్రిల్ 11(నమస్తే తెలంగాణ)/ మహబూబ్నగర్/హన్వాడ: ఎండాకాలం ప్రారంభం నుంచే భానుడు భగభగమంటున్నాడు. ఉదయం ఏడు గంటలకు మొదలైన ఎండ సాయంత్రం ఆరుగంటలైనా తగ్గడంలేదు. దీంతో ఉపశమనం పొందేందుకు ప్రజలు శీతల పానియాలు తాగుతున్నారు. మరో ఐదురోజులపాటు ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈక్రమంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
సాధారణానికి మించి..
ఎండల తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. గత రెండు వారాలుగా పగటి పూట ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఏప్రిల్ మధ్యకు రావడంతో సూర్యుడు మరింత మండుతున్నాడు. సాధారణానికి మించి రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ‘మే’ ను తలపించేలా ఎండలు ప్రభావం చూపుతున్నా.. అక్కడక్కడా వడగండ్ల వానలు, అకాల వర్షాలతో రాత్రి పూట చల్లటి గాలులు వీస్తున్నాయి. కాగా మధ్యాహ్నం వేళ బయటకు రావాలంటే ప్రజలు జంకే పరిస్థితులు తలెత్తాయి. ఉద్యోగులు, వ్యాపారులు, పనిపై బయటికొచ్చే వారు ఉష్ణతాపంతో నానా ఇబ్బందులు పడుతున్నారు.
గొడుగులు పట్టుకొని, టవళ్లు, టోపీలు, మహిళలైతే చీరకొంగులు తలపై చుట్టుకొని రోడ్డెక్కుతున్నారు. దీంతో రద్దీగా ఉండే రహదారులన్నీ మధ్యాహ్నం వేళ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. వడగాలులు వీస్తుండడంతో సాయంత్రం 7గంటల వరకు వేడి ప్రభావం ఉంటోంది. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు కొబ్బరి బొండాలు, శీతల పానియాలతోపాటు ఫ్రిజ్లు, మట్టి కుండల్లోని నీటిని తాగుతున్నారు. ఇండ్లల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీ లేకుంటే ఉక్కపోతను భరించలేకున్నారు. ఈక్రమంలో రోడ్ల వెంట టోపీలు, మట్టి కుండలు, కూలింగ్ అద్దాల అమ్మకాలు జోరందుకున్నాయి. ఉదయం 12గంటలలోగా పనులు ముగించుకోవాలని.. సాయంత్రం 4గంటల తర్వాతే బయటికి వెళ్లడం శ్రేయస్కరమని వైద్యులు సూచిస్తున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా ఉపాధి కూలీలు ఉదయమే పనులు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఎండలో తిరిగితే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. మే, జూన్ వరకు ఎండల ప్రభావం ఉండనున్నది.
వడదెబ్బకు ప్రథమ చికిత్స
* వడదెబ్బకు గురైన వ్యక్తిని నీడలోకి చేర్చాలి.
* శరీరాన్ని చల్లని నీటితో ముంచిన గుడ్డతో తుడవాలి.
* ఉప్పు కలిపిన చల్లటి నీరు, కొబ్బరినీరు, నిమ్మరసం, గ్లూకోజ్ లేదా ఓఆర్ఎస్ కలిపిన నీటిని తాగించాలి.
* వెంటనే దగ్గరలోని దవాఖానకు తరలించాలి.
వడదెబ్బ లక్షణాలు
* శరీర ఉష్ణోగ్రత తీవ్రంగా పెరగడం.
* విపరీతమైన తలనొప్పి రావడం.
* నాడీ వేగంగా కొట్టుకొవడం, నాలుక ఎండిపోవడం
* శరీరంలో గంటగంటకూ నీటిశాతం తగ్గడం.
* పాక్షిక లేదా పూర్తిగా అపస్మారక స్థితిలోకి చేరుకోవడం.
* వాంతులు, విరేచనాలు ఎక్కువవడం
వేడి నుంచి ఉపశమనానికి..
* ఇంట్లో వాతావరణం చల్లగా ఉండేలా కిటికీలు, తలుపులకు కర్టెన్లు వేసుకొని నీళ్లు చ ల్లుకోవాలి.
* బయటకు వెళ్లేటప్పుడు సన్స్క్రీన్ లోషన్లు, కూలింగ పౌడర్లు ఉపయోగించాలి.
* శీతల పానియాలకు బదులుగా పండ్ల రసా లు, నిమ్మకాయ, చెరకు, సబ్జా రసాలు, కొబ్బరినీరు, మజ్జిగ తాగాలి.
* కొబ్బరి బొండాలు, కీరదోస, కర్బూజా వం టి పండ్లు తినాలి.
* రోజుకు ఐదులీటర్ల మంచినీరు తీసుకోవాలి.
* వదులుగా ఉండే, తెల్లటి వస్ర్తాలు ధరించాలి.
* గొడుగు, టోపీ, కూలింగ్ అద్దాలు, హెల్మెట్, గ్లౌజులు ధరించాలి.
* రోజుకు రెండుసార్లు స్నానం చేయాలి.
* పిల్లలు, వృద్ధులు ఎండలో బయటికి వెళ్లకపోవడం మంచిది.
* డీ హైడ్రేషన్కు గురైతే మంచినీరు, కొబ్బరి నీళ్లు తాగాలి.
* పరిస్థితి తీవ్రంగా ఉంటే తప్పకుండా దవాఖాకు వెళ్లాలి.
* దోమలు కుట్టకుండా రాత్రి వేళ కాయిల్స్, దోమతెరలు ఉపయోగించాలి.
* మసాలాలు, మాంసాహారం వీలైనంత వరకు తగ్గించాలి.
ప్రజలకు అందుబాటులోఉన్నాం
హన్వాడ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో పలు గ్రామాల నుంచి వచ్చే వారికి అందుబాటులో ఉంటూ చికిత్స చేస్తునాం.. ఇక్కడ అన్ని మందులు అందుబాటులో ఉన్నాయి. రోజురోజుకూ ఎండల తీవ్రత పెరుగుతుండడంతో ఉపాధి కూలీలకు సలహాలు, సూచనలు ఇస్తున్నాం.
– డాక్టర్ ప్రగతి, మండల వైద్యాధికారి హన్వాడ