వనపర్తి, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ) : కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలకు.. ఒమిక్రాన్ భయం వెంటాడుతున్నది. ప్రమాదం ఏమీ లేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నది. ఈ క్రమంలో మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాలని.., రెండు డోస్ల టీకాలు వేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాల్లో వ్యాక్సినేషన్ను వేగవంతం చేయాలన్న కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా ఆదేశాల మేరకు వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. రెండో డోస్ వేసుకోని వారిని గుర్తించి వ్యాక్సిన్ వేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఇటీవల వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాకు వచ్చిన సీఎం కేసీఆర్ వ్యాక్సినేషన్పై డీఎంహెచ్వో చందూనాయక్, మంత్రి నిరంజన్రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. రెండు డోస్లను కచ్చితంగా వేసుకోవాలని, అప్పుడే కరోనా తీవ్రత తక్కువగా ఉంటుందని సూచించారు. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా స్పెషల్ క్యాంప్లు ఏర్పాటు చేసి ఈ నెల చివరి వరకు వంద శాతం వ్యాక్సిన్ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.
అందుబాటులో వ్యాక్సిన్లు..
కరోనా మహమ్మారి నుంచి రక్షణకుగానూ జిల్లాలో వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. సీపీ యూనిట్, పీహెచ్సీల్లో టీకా కేంద్రాలు ఏర్పాటు చేయడంతోపాటు ప్రజల ఇంటి వద్దకే వెళ్లి టీకా వేస్తున్నారు. టీకా ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. భౌతిక దూరం పాటిస్తూ, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరుతున్నారు. బలమైన పోషకాహారం తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. కలెక్టర్ ఎప్పటికప్పుడు సమీక్షలు జరిపి వైద్యాధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. జిల్లాలో మొదటిడోస్ వేసుకున్న వారు 4,27,849 మంది కాగా, రెండో టీకాను 3,68,210 మంది వేసుకున్నారు. ఇంకా సెకండ్ డోస్ వేసుకోని వారు 56,639 మంది ఉన్నారు.
వ్యాక్సినేషన్పై స్పెషల్ డ్రైవ్..
ఈ నెలాఖరు వరకు వంద శాతం వ్యాక్సినేషన్ జరిగేలా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నాం. కళాశాలల్లో స్పెషల్ క్యాంప్లు ఏర్పాటు చేసి 18 ఏండ్లు నిండిన వారికి వ్యాక్సిన్ వేస్తున్నాం. 255 గ్రామ పంచాయతీల్లో సర్పంచులు, ప్రజాప్రతినిధులు, వార్డు సభ్యులతోపాటు మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధుల చొరవతో టాస్క్ పూర్తిచేస్తాం. ఏఎన్ఎంలు, ఆశ వర్కర్ల సేవలు ఉపయోగించుకుంటాం.
86 శాతం పూర్తి..
జిల్లాలో 18 ఏండ్ల పైబడిన వారు 4,27, 849 మంది ఉన్నారు. వీరిలో మొదటి డోస్ 3,68,210 మంది వేసుకున్నారు. నిర్ధిష్ట సమయం ముగిశాక కూడా రెండో డోస్ వేసుకోవడం లేదు. ఇప్పటివరకు రెండో డోస్ను 86 శాతం పూర్తి చేశాం. మిగతా వారు కూడా టీకా వేసుకోవాలి. రెండో డోస్ వేసుకోని వారికి ఆశ కార్యకర్తలతో ఫోన్లు చేసి దగ్గరలోని టీకా కేంద్రాల వివరాలు అందిస్తున్నాం. అలాగే ప్రజలు వద్దకు వెళ్లి అర్హత ఉన్న వారికి టీకా వేస్తున్నాం. – చందూనాయక్, డీఎంహెచ్వో, వనపర్తి