టమాట.. మోత మోగిస్తోంది. మిర్చి ఘాటెక్కుతోంది. మార్కెట్లో కూరగాయల ధరలు కొండెక్కాయి. అవసరాలకు సరిపడా కూరగాయలు లేకపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. వారం రోజుల వ్యవధిలోనే దాదాపు అన్ని రకాల కూరగాయల ధరలు రెట్టింపయ్యాయి. ఇప్పటికే నిత్యావసర సరకుల ధరలు ఆకాశాన్ని తాకుతుంటే.. పెరిగిన కూరగాయలు ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి.
జడ్చర్ల, జూలై 8 : కూరగాయల ధరలు రోజురోజుకు పెరుగుతూ కొండెక్కి కూర్చున్నాయి. ప్రతి కూరగాయలకు అధిక ధరలు పలుకుతుండడంతో సామాన్య ప్రజలు కొనలేని స్థితిలో ఉన్నారు. ఏ కూరగాయ తీసుకున్నా ధరలు మండుతున్నాయి. టమాట ఠారెత్తిస్తుంటే మిర్చి మంటపుట్టిస్తోంది. భారీ వర్షాలు, విపరీతమైన ఎండల కారణంగా కూరగాయల పంటలు దెబ్బతినడంతో దిగుబడులు లేక ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అదేవిధంగా తోటలు కూడా లేకపోవడం, ప్రస్తుతం తోటలు నాటుతున్నారు రైతులు అది కాపునకు వచ్చే సరికి దాదాపు రెండు నుంచి మూడునెలలు పట్టే అవకాశం ఉంటుంది.
అంటే అప్పటి వరకు ధరలు ఏ స్థాయికి చేరుకుంటాయో అది తలచుకుంటే గుండె ఆగిపోతుంది. ప్రస్తుతం కూరగాయలు మొత్తం బయటి రాష్ర్టాల నుంచి వస్తుంది. టమాట కర్ణాటక రాష్ట్రంలోని కోలార్, చింతామణి నుంచి వస్తుండగా మిర్చి కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాం నుంచి వస్తుంది. దొండ ఆంధ్రప్రదేశ్లోని నర్సరావుపేట నుంచి వస్తుందని వ్యాపారులు తెలుపుతున్నారు. స్థానికంగా టమాట, మిర్చి, దొండ, బెండ, బీర్నీస్ తదితర కూరగాయలు లేకపోవడంతో ఇతర రాష్ర్టాల నుంచి తీసుకువచ్చి అమ్మడం జరుగుతుంది. దీంతో కూరగాయల ధరలు మండిపోతున్నాయి.
జూన్లో మొదటి వారంతో రూ.50లు ఉన్న టమోటా, మిర్చి జూలై వచ్చే సరికి రూ.120కి చేరింది. కొత్తగా వేసిన పంటలు మార్కెట్కు రావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉండడంతో కూరగాయల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు తెలుపున్నారు. కూరగాయల ధరలు పెరిగిపోతుండడంతో సామాన్యులు కూరగాయలు కొనుగోలు చేసే పరిస్థితి లేకుండా పోతుంది. ప్రతిరోజూ వంటకు టమాట, మిర్చి తప్పని అవసరం అలాంటి వాటి ధరలు ఆకాశాన్నంటడంతో అసలు భోజనమెట్లని ప్రజలు వాపోతున్నారు. టమాట, మిర్చి మానేయాలనే దానికి వినియోగదారులు వచ్చారు. కూరగాయల రేట్లు చికన్రేట్లకు ఏమాత్రం తీసిపోవడం లేదు. కూరగాయల బదులు చికెన్తిన్నా మేలని భావిస్తున్నారు ప్రజలు.
పగలంతా పనిచేస్తే కూరగాయలకే సరిపోతుంది
కూరగాయలు కొనడానికి వస్తే వాటి ధరలు చూస్తుంటే భయ్యమేస్తుంది. కూరగాయాలు కొనుగోలు చేయాలంటే వాటి ధరలు ఒక రోజు కూలిచేస్తే వచ్చే పైసలు మొత్తం వాటికే అయ్యేవిధంగా ధరలు ఉన్నాయి. పగలంతా పనిచేస్తే వచ్చే డబ్బు లు కేవలం కూరగాయలకు అయితే సంసారం ఎలా గడుస్తుంది. కూరగాయల రేట్లు చికన్ రేట్లను తలపిస్తున్నాయి. కూరగాయలు కొనుగోలు చేసేకంటే పస్తులండటం మేలనిపిస్తుంది. కూరగాయాల ధరలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుని కూరగాయల ధరలు తగ్గేవిధంగా చర్యలు తీసుకోవాలి. లేదంటే రోజు వాడే టమాట, మిర్చి సామాన్యులు కొనుగోలు చేసే స్థితిలో లేరు.
– శివ, కొత్తూరు వినియోగదారుడు