ఎగువన కురుస్తున్న వానలకు ఇన్ఫ్లో
అయిజ, జూన్ 24: కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వానలకు తుంగభద్ర డ్యాంలో నీటి నిల్వ 44 టీఎంసీలకు చేరుకున్నది. శుక్రవారం ఇన్ఫ్లో 2,088 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 296 క్యూసెక్కులు నమోదైంది. టీబీ డ్యాం 105.788 గరిష్ఠ నీటినిల్వ సామర్థ్యానికి గాను, ప్రస్తుతం 44.055 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. 1633 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టానికి ప్రస్తుతం 1613.10 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు టీబీ బోర్డు ఎస్ఈ నాగమోహన్, డ్యాం సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు. గతేడాది ఇదే సమయంలో 28.164 టీఎంసీలు నిల్వ ఉండేదని పేర్కొన్నారు.
అలాగే ఆర్డీఎస్ ఆనకట్టకు ఇన్ ఫ్లో తగ్గుతోంది. 107 క్యూసెక్కులు ఇన్ఫ్లో ఉండగా, ప్రధాన కాల్వకు 58 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 118 క్యూసెక్కులు కన్స్ట్రక్షన్ స్లూయీస్ నుంచి దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి చేరుతోందని ఆర్డీఎస్ కర్ణాటక ఏఈ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం ఆనకట్టలో ప్రస్తుతం 3.3 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.