ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ పదవులిచ్చి గుర్తించారు
ఆబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
జిల్లా ఆర్యవైశ్య, జడ్చర్ల పట్టణ ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకారోత్సవం
జడ్చర్లటౌన్, మే 9: రాష్ట్రంలోని ఆర్యవైశ్యులందరూ రాజకీయంగా, ఆర్థికంగా ఎదుగుదల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఆబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జడ్చర్లలోని చంద్రాగార్డెన్ ఫంక్షన్హాల్లో సోమవారం సాయంత్రం జరిగిన జిల్లా ఆర్యవైశ్య సంఘం, జడ్చర్ల ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ బి. దయానంద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ మొట్టమొదటగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్యవైశ్యులను గుర్తించి రాజకీయ పదవులను ఇచ్చి గౌరవాన్ని కల్పించారన్నారు. సమాజంలో దానధర్మాలు, సేవా కార్యక్రమాలకు ఆర్యవైశ్యులే స్ఫూర్తి అని చెప్పారు. సెంటిమెంట్, రాజకీయ పబ్బం కోసం వచ్చే వారి మాటాలను నమ్మి మోసపోవద్దన్నారు. అంతకు ముందు ఎంపీ,ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఆర్యవైశ్యులు సేవా కార్యక్రమాలతో పాటు రాజకీయంగా ఎదగాలన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్యవైశ్యులకు అన్ని విధాలా అభివృద్ధి చెందుతున్నారన్నారు. ఆర్యవైశ్యులకు అన్నివిధాలా అండగా ఉంటామన్నారు. అంతకు ముందు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పాలాది రాంమోహన్, జిల్లా ప్రధానకార్యదర్శి మేడిశెట్టి రామకృష్ణతో పాటు నూతన కార్యవర్గం, అనుబంధ కార్యవర్గాలు, జడ్చర్ల పట్టణ ఆర్యవైశ్య సంఘం, అనుబంధ కార్యవర్గ సభ్యులు ప్రమాణం చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ, పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్, జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, తెలంగాణ సంగీత నాటక అకాడమీ మాజీ చైర్మన్ బాద్మి శివకుమార్, మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మీ, వైస్చైర్పర్సన్ సారిక, కొత్తకోట ఎంపీపీ గుంత మౌనిక, రాష్ట్ర, జిల్లా ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు.