అచ్చంపేట, సెప్టెంబర్ 26 : గలగల పారేటి సెలయేళ్లు.. జలజల దుంకుతున్న జలపాతా లు.. ప్రకృతి చెక్కిన శిలలు.. పక్షుల కిలకిలరావాలు.. గిరు లు.. సొగసిరుల మధ్య హొయలు పోతున్న కృష్ణమ్మ.. నదీ తీరంలో సుందర కాటేజీలు.. లాహిరి.. లాహిరి అం టూ లాంచీ ప్రయాణం.. ఇలా చెప్పుకుంటూ పోతే నేచర్ అందాలు తనివితీరనివి. అలాంటి రమణీయ దృశ్యాలు నల్లమల ఒడిలో ఎన్నో ఉన్నాయి. ఓవైపు ఆధ్యాత్మిక పరవ ళ్లు.. మరోవైపు సుందరమైన అటవీ దృశ్యా లు కనువిందు చేస్తున్నాయి. తెలంగాణ ఏ ర్పడ్డాక హరితహారంతో అడవుల వి స్తీర్ణం పెంచడంతోపాటు రూ.వందల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి సందర్శకులు తరలివచ్చి అందాలను ఆస్వాదిస్తున్నారు. నేడు ప్రపంచ పర్యాటక దినోత్స వం సందర్భంగా సందర్శక ప్రాంతాలపై కథనం..
ప్రకృతి అందాలను తనివితీరా ఆస్వాదించేందుకు ఎక్కడికో పరుగులు పెట్టాల్సిన పనిలేదు. నల్లమల అటవీ ప్రాంతంలో కనువిందు చేసే ప్రకృతి అందాలెన్నో ఉన్నాయి. ఫారెస్ట్ అందాలను వీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఏర్పాట్లు చేసింది. శ్రీశైలం వెళ్లినప్పుడు నల్లమల అడవిని చూడడం తప్పితే.. అటవీ అందాలను ప్రత్యేకంగా ప్లాన్ చేసుకొని చూసే వారు చాలా తక్కువ. నిజానికి అడవిలో కనువిందు చేసే జలపాతాలు, వన్యప్రాణులు అనేకం అన్నాయి. ఫారెస్ట్లో విడిది చేసేందుకు కాటేజీలు సైతం అందుబాటులో ఉన్నాయి. నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..
రూ.100 కోట్లతో టూరిజం అభివృద్ధి..
ప్రత్యేక రాష్ట్రంలో నల్లమలను టూరిజం హబ్గా ఏర్పాటు చేసేందుకు రూ.100 కోట్లను కేటాయించి అభివృద్ధి చేసింది. అక్కమహాదేవి గుహ ఆలయంలో రూ.70 కోట్లు ఖర్చుపెట్టి వసతులు కల్పించారు. మెట్ల మార్గం, కుర్చీలు, రోడ్డును సరిచేయడం వంటి ఏర్పాట్లు చేశారు. దోమలపెంట అక్కమహాదేవిగుహల నుంచి సోమశిల వరకు కృష్ణానదిలో బోటింగ్ సౌకర్యాన్ని కల్పించారు. ఈగలపెంట, మన్ననూరు వద్ద కాటేజీలు, రెస్టారెంట్ నిర్మించి.. మృగవాణి రిసార్ట్వారికి టెండర్ ద్వారా అప్పగించారు. రూ.5.7 కోట్లతో మల్లెలతీర్థంను అభివృద్ధి చేశారు. రూ.10.35 కోట్లతో ఉమామహేశ్వరం ఆలయం వద్ద మెట్లు, ఆలయం నుంచి పాపనాశనం వరకు సీసీరోడ్డు, పై నుంచి కిందకు వర్షపునీళ్లు వచ్చేలా డ్రైనేజీ, సోలార్లైట్లు, గోడల విస్తరణ, షెడ్డు వంటివి నిర్మించారు. దీంతో నల్లమలకు సెలవులు, శని, ఆదివారాల్లో పర్యాటకుల సందడి పెరిగింది. మన్ననూర్ నుంచి పాతాళగంగ వరకు రోడ్లపై వ్యాపారాలు విస్తరించాయి.
ఒకటి నుంచి సఫారీ పున:ప్రారంభం..!
నల్లమలలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో వచ్చే నెల 1వ తేదీ నుంచి సఫారీ పున:ప్రారంభం కానున్నది. నిత్యం 12 మంది ప్యాకేజీ కింద అటవీ ప్రాంతంలో ఒకరోజు గడిపేందుకు అవకాశం కల్పించనున్నది. ఇందుకుగానూ పర్యాటకులు amrabadtigerres erve.com వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలి. ఇందులోమూడు రకాల ప్యాకేజీలు ఉన్నాయి. ఇద్దరికి ఏసీ గదిలో రెండుపడకల కాటేజీలో బసకు రూ.4,600, రూ.7 వేలతో నలుగురికి, రూ.9,200తో ఆరుగురికి అవకాశం ఉంటుంది. ఆరేండ్లలోపు వారికి ఎలాంటి చార్జీలు ఉండవు. టిఫిన్లు, నీళ్లు, ఆహారానికి ప్రత్యేకంగా చార్జీలు ఉంటాయి. అటవీశాఖ ఆధ్వర్యంలో ఆక్టోపస్, ఫరహాబాద్ వ్యూపాయింట్, ప్రతాపరుద్రుడి కోట, ట్రెక్కింగ్, మన్ననూర్లోని సీబీఈటీ, ఈఈసీ కేంద్రాన్ని సందర్శించొచ్చు. అయితే, వర్షాలు కురిస్తే మాత్రం సఫారీ మరికొన్ని రోజుల వాయిదా పడే అవకాశం ఉన్నది.
మనోహరం.. మల్లెల తీర్థం
దట్టమైన నల్లమల అటవీ ప్రాంతం.. 500 అడుగుల ఎత్తుపై నుంచి దూకే జలపాతం.. పూర్వకాలంలో సిద్ధులు, మునులు తపస్సు చేసిన చోటు.. లోయల మధ్య ఉండే మల్లెలతీర్థంను చూస్తే.. పర్యాటకులకు ప్రశాంతత, ఆహ్లాదం కలుగుతుంది. అక్కడ సహజసిద్ధంగా ఏర్పడిన రెండు జలాశయాలు, కృష్ణానదిలో కలిసేందుకు వెళ్లే నీటి ప్రవాహం, చెట్లుచేమలు, అడవి జంతువులను చూసి తీరాల్సిందే. జలపాతంలో స్నానం చేస్తే సర్వపాపాలు తొలగుతాయని నమ్మకం. దాదాపు 300 మెట్లు దిగి లోయలో జలపాతం వద్దకు వెళ్లాలి. చెంచుల వైవిధ్యభరితమైన జీవనవిధానం అడుగడుగునా కనిపిస్తాయి. గతంలో ఇక్కడ ప్రతిష్ఠించిన శివలింగం శిథిలమైంది. మల్లెలతీర్థం పర్యాటకంగా అభివృద్ధి చెందడంతో పర్యాటకుల రాక పెరిగింది. ఎకో టూరిజం డెవలప్మెంట్ కింద సార్లపల్లి, కుడిచింతలబైలు కమిటీలకు అటవీశాఖ వారు గైడ్ సర్వీసుల అవకాశం కల్పించారు. దుకాణాలు, పార్కింగ్, వంట సామాన్లు వంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. కాగా, అక్కడ తరచుగా ప్రమాదాలు జరుగుతున్నందున ప్రస్తుతం మల్లెలతీర్థం వెళ్లేందుకు అటవీశాఖ అనుమతించడంలేదు.
ఇలా వెళ్లాలి.. శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిలో మన్ననూర్ మీదుగా వటువర్లపల్లి నుంచి 12 కిలోమీటర్ల దూరం వెళ్తే మల్లెలతీర్థం చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి 166 కి.మీ, మహబూబ్నగర్ నుంచి 135 కి. మీ, శ్రీశైలం నుంచి 60 కి.మీ, అ చ్చంపేట నుంచి 50 కి.మీ ఉంటుంది.
ఆకట్టుకునే అక్కమహాదేవి గుహలు..
మైసూర్ రాష్ట్రం(నేటి కర్ణాటక)లోని షిమోగా జిల్లా ఉడుతడి గ్రామంలో వీరశైవ భక్తులైన నిర్మలశెట్టి, సుమతీదేవి దంపతులకు అక్కమహాదేవి జన్మించింది. ఆమె గొప్ప గొప్ప శివభక్తురాలు. శివదీక్ష మంత్రోపదేశాన్ని పొంది ఎల్లప్పుడూ శివపూజలోనే కాలం గడిపేదని సోమశేఖరుడి ‘యోగాంత తత్త్వనిధి’ గ్రంథంలో చెప్పబడింది. మల్లికార్జునుడిపై ఎనలేని భక్తి. మల్లికార్జునస్వామి వరప్రసాదం వల్ల పుట్టిన అక్కమహాదేవి సంస్కృత భాషలో ప్రావీణ్యం కలిగి చక్కని రచనలు, ఉపన్యాసాలు ఇచ్చేవారట. 12వ శతాబ్ధానికి చెందిన శివశరణుల్లో పేరెన్నికగన్న అక్కమహాదేవి కొంతకాలం నల్లమలలో నివసించి గుహలోని సహజ శివలింగాన్ని పూజించిందట. నల్లమలలోని కదిలీవనంలోనూ తపస్సు చేసి.. చివరకు శ్రీశైల మల్లికార్జునస్వామిలో లీనమైందట. శ్రీశైలక్షేత్రంలోని చుక్కల పర్వతానికి సుమారు 16 కిలోమీటర్ల దూరంలో వాయువ్యదిశగా అక్కమహాదేవి గుహలున్నాయి. మొత్తం ఆరు గుహలుండగా.. మధ్యనున్న గుహలో అక్కమహాదేవి నివసించినదని ప్రతీతి. మెట్ల మార్గంలో శ్రీశైలం పాతాళగంగకు చేరుకొని.. అక్కడి నుంచి బోట్లో సుమారు 10 కి.మీ. పర్యటించి గుహాలకు చేరుకోవచ్చు. ఈ ప్రయాణంలో చుట్టూ ఎత్తైన కొండలు, కృష్ణానది అందాలు ఆకట్టుకుంటాయి. అలాగే, సోమశిల నుంచి కృష్ణానదిలో అక్కమహాదేవి గుహల వరకు బోటులో చేరుకోవచ్చు. ఈ గుహల ప్రవేశద్వారంపై ఉన్న సహజశిలా తోరణం అద్భుతం.. భూమికి 200 అడుగుల ఎత్తులో సుమారు 250 అడుగుల పొడవు, 16 అడుగుల వెడల్పు, 6 అడుగుల మందంతో ఉన్న శిలాతోరణం ఎలాంటి ఆధారం లేకుండా నిలిచి ఉంటుంది. దేశంలోనే పెద్ద శిలాతోరణాల్లో ఇది ఒకటిగా చెప్పొచ్చు.
ఇలా వెళ్లాలి : శ్రీశైలానికి వాయువ్య దిక్కులోని పంచమఠాల నుంచి చుక్కల పర్వతం చేరుకొని.. అక్కడి నుంచి జాతరేవు చేరుకోవాలి. బుగ్గవాగు మీదుగా చెంచు పెంటలగుండా గుహలకు వెళ్లొచ్చు. శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిలో 44 కి.మీ. ప్రయాణించి.. అక్కడి నుంచి ఎడమ వైపునకు 12 కి.మీ. వెళ్తే గుహలు వస్తాయి.
లింగమయ్య దర్శనం.. మహాద్భుతం..
ప్రకృతి సోయగాల మధ్య వెలిసిన సలేశ్వర క్షేత్రంలో నింగి నుంచి నేలకు జారుతున్న సేలయేరు ఎంతగానో కనువిందు చేస్తుంది. నీళ్లు పారే పైభాగాన్ని పుష్కరతీర్థమని, కింది భాగంలో నీళ్లు పారే ప్రాంతాన్ని సలేశ్వరం తీర్థంగా పిలుస్తారు. ఈ తీర్థానికి పడమర వైపు పది అడుగుల ఎత్తులో శనేశ్వర ఆలయం ఉంటుంది. అక్కడున్న గర్భాలయ ముఖ మండపాలకు మధ్యగల గోడను చరిత్రకారులు పరిశీలించి క్రీ.శ. 6, 7 శతాబ్దాలకు చెందినదిగా పేర్కొన్నారు. ఇప్పటివరకు ఎలాంటి శాసనాలు లభించకపోవడంతో ఎవరు ప్రతిష్ఠించారో వెలుగులోకి రాలేదు. ఈ ఆలయానికి కుడివైపున వీరభద్రుడి విగ్రహం ఉన్నది. ఏటా ఛైత్రపౌర్ణమి సందర్భంగా మూడు రోజులపాటు ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. సహజసిద్ధంగా వెలిసిన సలేశ్వరం గుండంలోకి దాదాపు 200 అడుగులపై నుం చి హొయలొలుకుతూ జాలువారే ఔషధ గుణాలున్న జలపాతంలో స్నానమాచరిస్తే సర్వపాపాలు, రోగపీడితలు తొలగుతాయని భక్తుల నమ్మకం. చెట్ల సెలయేళ్ల నుంచి జాలువారే జలపాతాన్ని చాలా మంది భక్తులు వాటర్బాటిళ్లలో ఇంటికి తీసుకెళ్తారు. అయితే సలేశ్వరం లింగమయ్య దర్శనం ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఉంటుంది. మూడేండ్లుగా ప్రభుత్వం నిధులు విడుదల చేసి ఉత్సవాలను నిర్వహిస్తున్నది.
ఇలా వెళ్లాలి : శ్రీశైలం- హైదరాబాద్ ప్రధాన రహదారి నుంచి ఫరహాబాద్ చౌరస్తా మీదుగా దాదాపు 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న సలేశ్వరం క్షేత్రం చేరుకోవచ్చు. రాంపూర్పెంట వరకు వాహనాలు వెళ్తుండగా.. అటు నుంచి 6 కి.మీ. వరకు లోయప్రాంతంలోని జలపాతాల వద్దకు కాలినడకన వెళ్లాలి. అలాగే లింగాల నుంచి అప్పాయిపల్లి మీదుగా గోర్జా గుండాల వరకు వాహనాల్లో వెళ్లి.. అక్కడినుంచి 12 కి.మీ. కాలినడకన ప్రయాణించాలి. హైదరాబాద్ నుంచి 186 కి.మీ, మహబూబ్నగర్ నుంచి 151 కి.మీ, అచ్చంపేట నుంచి 51 కి.మీ, మన్ననూర్ నుంచి 45 కి.మీ. ఉంటుంది.
లొద్దిమల్లయ్య క్షేత్రం..
బల్మూర్ మండలం బాణాల సమీపంలో కొలువుదీరిన లొద్దిమల్లయ్య క్షేత్రం ఆకట్టుకుంటున్నది. ఉత్సవాల సందర్భంగా పలు ప్రాం తాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. ఏకాదశిని పురస్కరించుకొనిఉత్సవాలు నిర్వహిస్తారు. చెంచు గిరిజనులే పూజారులుగా వ్యవహరిస్తారు. గుండంలో స్నానాలు చేసి స్వామివారిని ద ర్శించుకుంటారు. కొండల నుంచి జాలువారే జలపాతం ఆకట్టుకుంటుంది.
ఇలా వెళ్లాలి : హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారిలో మన్ననూర్కు 8 కిలోమీటర్ల వెళ్లి.. అక్కడినుంచి 10 కి.మీ. కాలినడకన ప్రయాణించాలి. అలాగే బల్మూర్ మండలం బాణాల నుంచి 5 కిలోమీటర్లు కాలినడకన చేరుకోవాల్సి ఉంటుంది.
నల్లమల్లోని అరుదైన సంపద..
ఔషధ మొక్కలు : మారేడు, నేరేడు, ఉసిరి, కరక్కాయ, కుంకుడుకాయ, అశ్వగంధం, పిల్లితీగలు, నేలవాము, నేల, ఉసిరి, గన్నేరు.
అరుదైన వృక్షాలు : శ్రీగంధం, జిట్రేగి, తెల్లమద్ది, సండ్ర.
కలపజాతి వృక్షాలు : టేకు, మామిడి, సుబాబుల్, మద్ది, వేప, ఎగిస, బండారు, చిరంజి, తపసి, నల్లమద్ది.
ఇతర రకాల వృక్షాలు : రావి, మర్రి, చింత, కానుగ, రేల, బూడగ, ముల్లెంజాతి, వెదురు.
జంతువులు : పులులు, అడవి దున్నలు, దుప్పి, ఎలుగుబంటి, అడవికుందేలు, నక్కలు, నీలగాయ్, సాంబ, చుక్కల జింక, మౌస్డీర్, కొండగొర్రె, జింకలు, అడవి పిల్లులు, 80 రకాల జాతులకుపైగా పక్షులు ఉన్నాయి.