మహబూబ్నగర్ మెట్టుగడ్డ, నవంబర్ 13: మధుమేహం ఇప్పుడు అన్ని వర్గాల్లోనూ కనిపించే జబ్బు. ఏ నలుగురు కలిసినా, వారిలో ఒకరు షుగర్ పేషంట్ ఉంటున్నారు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు కారణంగా జబ్బు విజృంభిస్తోంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలు అనే తేడాలేకుండా అందరినీ పీడిస్తున్నది. జనాభా పరంగా చూస్తే, షుగర్ పేషెంట్లు పట్టణ ప్రాంతాల్లో 2/3 వంతు, గ్రామీణ ప్రాంతాల్లో 1/3 వంతు ఉన్నారు. ప్రపంచ జనాభాల్లో 20 శాతం మంది మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వీరి సంఖ్య 42.5 కోట్లు. నేడు వరల్డ్ డయాబెటిక్ డే ఈ సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
టైప్ 1: తల్లిదండ్రులకు ఈ రకం మధుమేహం ఉంటే వారి పిల్లలకు కూడా పుట్టుకతో వచ్చే ప్రమాదం ఉంది. ఇన్సులిన్ లోపం కారణంగా వంశపారంపర్యంగా వ్యాధి సంక్రమిస్తుంది.
టైప్ 2: 35 ఏండ్లు పైబడిన వారిలో ఈ రకం మధుమేహం కనిపిస్తుంది. ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం, ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల దీనిబారిన పడుతున్నారు.
‘మధుమేహం బారిన పడినవారికి కుటుంబం అండగా నిలవడం, ఇంట్లో తీసుకోవాల్సిన చర్యలపై చైతన్యం కల్పించడం’ ఈవిషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈఏడాది అంశంగా ఎంచుకున్నది. దీని ప్రకారం.. కుటుంబంలో ఎవరికైనా మధుమేహం ఉంటే మిగిలిన సభ్యులు వ్యాధి ఉన్నవారిలో ైస్థెర్యం నింపాలి. ప్రతి 3నెలలకు ఒకసారి వైద్యపరీక్షలు చేయించాలి. పాలిష్ బియ్యంతో కాకుండా ముతక బియ్యంతో చేసిన అన్నం ఆహారంగా ఇవ్వాలి.
షుగర్ డే..
మధుమేహం వేగంగా విస్తరిస్తోంది. 1991నుంచి వ్యాధి తీవ్రతను గుర్తించిన అంతర్జాతీయ డయాబెటిక్ ఫెడరేషన్, ఏటా నవంబర్ 14న డయాబెటిక్ డే నిర్వహిస్తోంది. శరీరంలోని ఇన్సులిన్ను కనుగొన్న బాంటింగ్ పుట్టిన రోజు నవంబర్14. అందుకే ఆ రోజును వరల్డ్ డయాబెటిక్ డేగా నిర్వహిస్తున్నారు.
అటెన్షన్ ప్లీజ్
పిల్లలపై కూడా మధుమేహం ప్రభావం తీవ్రంగా ఉంటున్నది. ప్రతి వెయ్యి మందిలో ఒక చిన్నారి మధుమేహంతో ఇబ్బంది పడుతున్నారు. పిల్లలకు వంశపారంపర్యంగా ఈ జబ్బు సోకే ప్రమాదం ఉంటుంది. డయాబెటిక్ అంటే.. రక్తంలో ఉండాల్సిన దానికంటే ఎక్కువ మోతాదులో చక్కెర ఉండటం. ఇది మూత్రం ద్వారా బయటికి పోతుంది. శరీరంలో ఇన్సులిన్ పనిచేసే విధానంలో చిన్నలోపం వల్ల ఆహార పదార్థాలను శరీరం సక్రమంగా వినియోగించుకోలేదు. ఈకారణంగా షుగర్ వ్యాధి సోకుతుంది. సాధారణంగా రక్తంలో చెక్కర నిల్వలు తినకముందు 100 లోపు… తిన్న తర్వాత 140లోపు ఉండాలి. సాధారణ వ్యక్తులు 126/200 ఉంటే షుగర్ ఉన్నట్లు భావించి, వైద్యులను సంప్రదించాలి.
నడక రక్షణ
డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు మందులు వాడటం, సరైన ఆహారం తీసుకోవడమే కాకుండా ప్రతిరోజూ నడకగాని, వ్యాయామంగాని చేయాలి. రోజూ చెమట వచ్చే విధంగా 30నిమిషాలు నడిస్తే రోగి శరీరంలో ఇన్సులిన్ సరిగా పనిచేస్తుంది. కొవ్వు, బరువు తగ్గుతుంది. కండరాలను ధృడం చేస్తుంది. రక్త ప్రసరణ మెరుగుపడి, గుండె జబ్బులను దూరం చేస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది.
ప్రతి ఒక్కరూ తరుచూ రక్త పరీక్షలు చేయించుకోవాలి. మంచి ఆహారం, నడక, యోగా, సమయానికి ఆహారం తీసుకోవడంతో షుగర్ వ్యాధి సోకదు. షుగర్ ఉన్నవారు ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. దేశంలో ప్రతి ఐదుగురిలో ఒకరికి షుగర్ వస్తుంది. షుగర్ వల్ల బీపీ, పక్షవాతం, గుండెపోటు, కిడ్నీ సంబంధిత వ్యాధులు సోకుతాయి.
– డాక్టర్ బాల శ్రీనివాస్, జనరల్ ఫిజీషియన్, ఎండీ ప్రభుత్వ జనరల్ దవాఖాన,
మహబూబ్నగర్