అయిజ, ఫిబ్రవరి 7: తిక్కవీరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు వేళాయే.. పిలిస్తే పలికే దైవం.. కొలిచిన వారి కోర్కెలు తీర్చే భక్తులు కొంగు బంగారం.. తిక్కవీరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది. అయిజ పట్టణంలో బుధవారం నుంచి 21వ తేదీవరకు నిర్వహించేందుకు ఆలయ కమిటీ నిర్ణయించింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. పట్టణంలోని పెద్ద వాగు సమీపంలో తిక్కవీరప్ప నివసించి సిద్ధిపొందాడని ఇక్కడి భక్తుల విశ్వాసం. ఏటా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలను కనులపండువగా నిర్వహిస్తున్నారు.
జిల్లాలో తిక్కవీరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను పెద్దఎత్తున నిర్వహించనున్నారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు అశేషసంఖ్యలో తరలొచ్చి తిక్కవీరేశ్వరస్వామికి పూజలు చేయనున్నారు. ఇందుకుగానూ ఆలయ ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయానికి రంగురంగుల విద్యుద్దీపాలను అలంకరించారు. భక్తుల సౌకర్యార్థం తాగునీరు, నీడకోసం టెంట్లు ఏర్పాటు చేశారు.
కార్యక్రమాల వివరాలు ఇలా..
పట్టణంలోని తిక్కవీరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం తిక్కవీరేశ్వరస్వామి ఉత్సవ విగ్రహం ఊరేగింపు, కలశస్థాపన, రాత్రి చట్టసేవ నిర్వహిస్తారు. 9న సాయంత్రం హోమం, రాత్రి ప్రభోత్సవం, 10న ఉదయం నిత్యపూజలు, రాత్రి 12గంటలకు మహా రథోత్సవం నిర్వహించనున్నారు. 11న సందెరాళ్లు ఎత్తు పోటీలు, 12న అంతర్రాష్ట్ర భజన పోటీలు, శునకరాజముల పరుగు పందెం, 13న ఒంటెద్దు బండి గిరక పందెం పోటీలు, 13నుంచి 16వ తేదీవరకు విద్యార్థినీ, విద్యార్థులకు మండలస్థాయి డ్యాన్స్ కాంపిటేషన్, 14న అంతర్రాష్ట్ర పొట్టేళ్ల పొట్లాట పోటీలు, గతేడాది పదో తరగతిలో 10/10 జీపీఏ సాధించిన విద్యార్థులకు సత్కారం ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
15వ తేదీనుంచి అంతర్రాష్ట్ర పశుబల ప్రదర్శన పోటీలు
తిక్కవీరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 15వ తేదీనుంచి రైతు సంబురాలు నిర్వహించనున్నారు. అందులో భాగంగా 15వ తేదీన పాలపళ్ల విభాగం పశుబల ప్రదర్శన పోటీలు, 16వ తేదీన సేద్యపుటెద్దుల విభాగం పశుబల ప్రదర్శన పోటీలు, 17వ తేదీన సీనియర్ విభాగం పశుబల ప్రదర్శన పోటీలు నిర్వహించనున్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని 18వ తేదీన టిక్టాక్, శ్రీదేవి డ్రామాకంపెనీ, జబర్దస్త్ ఫేమ్ దుర్గారావు దంపతులు, టీవీ కళాకారుల ప్రదర్శన, జానపద గాయకుడు మేడికొండ రేలారే ప్రసాద్, మహేశ్వరి, పాలమూరు జయప్రకాశ్, జానపద నృత్యకళాకారులు అంజిబాబు బృందం సభ్యులతో నృత్య ప్రదర్శన, 21వ తేదీన తిక్కవీరేశ్వరస్వామి ఉత్సవ విగ్రహం ఊరేగింపుతో బ్రహ్మోత్సవాలకు ముగింపు పలకనున్నట్లు ఆలయ కమిటీ పేర్కొన్నది.