మహబూబ్నగర్టౌన్, జనవరి 14: రాష్ట్ర ప్రభుత్వం సర్కార్ బడులను బలోపేతం చేసింది. విద్యార్థులకు మెరుగైన విద్య అందిస్తున్నది. విద్యార్థుల్లో మానసికోల్లాసం కలిగించేందుకు, శారీరక దృఢత్వాన్ని పెంచేందుకు క్రీడలకూ ప్రాధాన్యమిస్తున్నది. ప్రతి పాఠశాలకు క్రీడా‘నిధి’ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా 806 ప్రభుత్వ పాఠశాలలకు రెండు విడతల్లో రూ.53.27లక్షలు మంజూరు చేసి ఎస్ఎంసీ ఖాతాల్లో జమ చేసింది. ఈ సొమ్ముతో యాజమాన్యాలు క్రీడాసామగ్రిని విద్యార్థులకు అందుబాటులో ఉంచాల్సి ఉన్నది.
ఒక విద్యా సంవత్సరంలో ప్రాథమిక పాఠశాలకు రూ.5వేలు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలకు రూ.10వేల చొప్పున క్రీడా నిధిని కేటాయించింది. ఇకనుంచి విద్యార్థులకు క్రీడా సామగ్రి అందుబాటులోకి రానుంది. స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలు, రైతులతోపాటు విద్యార్థుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం కల్పిన్నది. ప్రత్యేక నిధులు కేటాయిస్తూ పాఠశాలల అభివృద్ధికి తోడ్పాటునిస్తున్నది. 2022-23 విద్యా సంవత్సరానికి ‘మన ఊరు-మనబడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎనిమిదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం అమలు చేస్తూ కార్పొరేట్కు దీటుగా మెరుగైన విద్యను అందించనుంది. ఇదేక్రమంలో విద్యార్థులు క్రీడల్లోనూ రాణించేలా ప్రోత్సహిస్తున్నది. క్రీడలతో విద్యార్థుల్లో మనోైస్థెర్యం, శారీరక, మానసిక దృఢత్వం అందించేందుకు కృషి చేస్తోంది. ఇందుకు నిధులు విడుదల చేయడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం క్రీడానిధిని ఏ ర్పాటు చేసింది. విద్యార్థులకు క్రీడాసామగ్రిని అందిం చేందుకు ప్రత్యేక నిధులు విడుదల చేసింది. ఈ నిధులను నేరుగా ఎస్ఎంసీ చైర్మన్లు ఖాతాల్లో జమ చేసింది. క్రీడానిధి కి మంజూరైన నిధులతో ఎస్ఎంసీ చైర్మన్లు క్రీడా సామగ్రిని కొనుగోలు చేసి విద్యార్థులకు అందిస్తారు ఆసక్తి గల క్రీడల్లో విద్యార్థులకు నైపుణ్యం పెంచుకొని రాణించేందుకు క్రీడా నిధి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని వ్యాయామ ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సర్కారు బడుల్లో విద్యార్థులకు క్రీడల్లో రాణించే విధంగా వాలీబాల్, ఫుట్బాల్, క్రికెట్, బాస్కెట్బాల్, త్రోబాల్, స్కిప్పింగ్రోప్స్, షాట్పుట్ తదితర క్రీడా సామగ్రిని కొనుగోలు చేయాలని ప్రభుత్వం సూచించింది. ప్రతిరోజూ చదువే కాకుండా క్రీడల్లోనూ ప్రోత్సహించడంతో విద్యార్థులు చురుగ్గా ఉంటారు.