కొల్లాపూర్, జనవరి 2 : తెలంగాణ-ఆంధ్ర రాష్ర్టాల సరిహద్దు గుండా ప్రవహిస్తున్న కృష్ణానదిపై నడిపే ఆ రెండు ప్రాంతాలకు చెందిన మరబోట్ల యజమానుల మధ్య పడవల ప్రయాణంపై గొడవకు దారితీసింది. దీంతో రాయలసీమ ప్రాంతానికి చెందిన బెస్తలతో చర్చించేందుకు సోమవారం సోమశిల సర్పంచ్ బింగి మద్దిలేటి తమ గ్రామానికి చెందిన బోట్ల యజమానులతో కలిసి ఆవతలి వైపునకు బోట్లపై నదిలో మధ్యకు వెళ్లారు. అటు వైపు నుంచి రాయలసీమ బెస్తలు తారసపడగా, గొడవకు దారితీసిన పరిస్థితులను గురించి సర్పంచ్ మద్దిలేటి వారిని అడిగారు. దీంతో మాటమాట పెరిగి తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకున్నది. ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణానదిపై మరబోటు నడిపే రాయలసీమలోని (ఆవతలివైపు) సంగమేశ్వరం, సిద్దేశ్వరం, తెలంగాణలోని సోమశిలకు చెందిన తెలుగు బెస్తల మధ్య నెలకొన్న కమీషన్ల విభేదాలతో నదిపై మరబోటుపై ప్రయాణం చేసేవారికి బ్రెక్పడింది.
అయితే ఇది వరకు కొల్లాపూర్ మండలం సోమశిల నుంచి నదిపై మరబోటులో ప్రజలు, భక్తులను సంగమేశ్వరాలయానికి చేరవేస్తువచ్చారు. దీంతో ఇలా నడిపితే తమకు ఉపయుక్తం ఉండదని సిద్దేశ్వరం, సంగమేశ్వరం గ్రామాలకు చెందిన మరబోట్ల యజమానులు వాగ్వివాదానికి దిగారు. ఒక వేళ సోమశిల నుంచి వచ్చే మరబోట్లలో ప్రజలను సిద్దేశ్వరం వరకే తీసుకురావాలని రాయలసీమ మరబోట్ల యజమానులు ఆంక్షలను విధించారు. ఇందుకు సోమశిల వారు అంగీకరించలేదు. దీంతో సిద్దేశ్వరం నుంచి తాము నేరుగా సంగమేశ్వరాలయానికి తీసుకెళ్తూ ఉపాధి పొందుతామని సిద్దేశ్వరం ప్రజల వాదనకు దిగారు. దీంతో ఇరు ప్రాంతాల మరబోట్ల యజమానుల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించేందు కోసం సోమశిల సర్పంచ్ మద్దిలేటి వెళ్లి రాయలసీమ యజమానులతో జరిపిన చర్యలు విఫలయత్నమైయ్యాయి. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకొంది. దీంతో నదిలో మరబోట్లపై ప్రయాణం తాత్కాలికంగా నిలిచిపోయింది.