వనపర్తి జిల్లా కేంద్రానికి తలమానికంగా ఉన్న రాజభవనాన్ని మైసూర్ ప్యాలెస్ తరహాలో తీర్చిదిద్దనున్నారు. వనపర్తి రాజభవనాన్ని సంస్థానాధీశులు 24 ఎకరాల్లో ఎంతో అద్భుతంగా నిర్మించారు. మూడో రాజా రామేశ్వర్రావు ఆధ్వర్యంలో 1959లో అప్పటి పీఎం నెహ్రూ చేతుల మీదుగా రాజభవనంలో పాలిటెక్నికల్ కళాశాలను ప్రారంభించారు. ఆనాటి నుంచి నేటి వరకు ఎందరో విద్యార్థులు ఇక్కడ చదువుకున్నారు. శ్రీలంక, నేపాల్, భూటాన్ వంటి దేశాల నుంచి సైతం ఇక్కడికి వచ్చి విద్యాభ్యాసం చేస్తున్నారు. అంతటి ప్రాశస్త్యం ఉన్న కట్టడాన్ని సమైక్య రాష్ట్రంలో పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరుకున్నది. గమనించిన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి రాజభవనం, పాలిటెక్నికల్ కళాశాలకు పూర్వవైభవం తీసుకురావాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్తో మాట్లాడి రూ.22 కోట్లను మంజూరు చేయించారు. ఈ నిధులతో ప్యాలెస్ పునర్నిర్మాణంతోపాటు వెనుక భాగంలో ఉన్న హాస్టల్లో సమస్యలను పరిష్కరించి, నూతన భవనాలను నిర్మించి విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలను కల్పించనున్నారు. ఇప్పటికే పాలిటెక్నిక్ కళాశాల ముఖద్వారం వద్ద వెల్కంబోర్డు, మైదానంలో వాకింగ్ట్రాక్ ఏర్పాటు చేశారు. రాజభవనానికి పూర్వవైభవం వచ్చేలా పనులు చేపట్టనుండడంతో వనపర్తి జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– వనపర్తి అర్బన్, ఆగస్టు 20
వనపర్తి అర్బన్, ఆగస్టు 20: వనపర్తి జిల్లా కేంద్రానికి తలమానికంగా ఉన్న రాజభవనానికి మహర్దశ సంతరించుకోనున్నది. రాజభవనాన్ని సంస్థానాధీశులు 24ఎకరాల్లో ఎంతో అద్భుతంగా నిర్మించారు. మూడో రాజారామేశ్వర్రావు ఆధ్వర్యంలో 1959లో అప్పటి పీఎం నెహ్రూ చేతుల మీదుగా రాజభవనంలో పాలిటెక్నికల్ కళాశాలను ప్రారంభించారు. 1960నుంచి రాష్ట్రంలోనే రెండోస్థానంలో వనపర్తి రాజాభవనంలోని ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలగా పేరుగాంచింది. నాటికాలంలో వనపర్తిలో రాజారామేశ్వర్రావు 1934లో తెలుగు ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేయించారు. ఇతర ప్రాంతాల నుంచి తెలుగు ఉపాధ్యాయులను తీసుకొచ్చి విద్యాబోధన చేయించారు. నాటినుంచి వనపర్తి విద్యకు నిలయంగా మారింది. అంతంటి ఘన చరిత్ర ఉన్న రాజాభవనంలోని పాలిటెక్నికల్ కళాశాల, రాజాభవనం ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యం కారణంగా పూర్వవైభవాన్ని కోల్పోవాల్సి వచ్చింది. తెలంగాణ ఏర్పాటు అనంతరం మంత్రి నిరంజన్రెడ్డి రాజభవనంపై దృష్టిసారించారు. వనపర్తి జిల్లాగా ఏర్పాటు కావడంతో వనపర్తి సంస్థానానికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందించారు.
రాజభవన చరిత్ర ఇలా…
ఆనాటి రాజు కాలంలో మొదటి రాజారామేశ్వర్రావు ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో భవన నిర్మాణం 1849లో చేపట్టి 1864లో ప్రథమ దశ నిర్మాణం పూర్తి చేశారు. ఆయన తదనంతరం రెండో రాజారామేశ్వర్రావు ఈ భవన నిర్మాణాన్ని పూర్తిచేశారు. ఈయన తదనంతరం మూడో రాజారామేశ్వర్రావు ఆధ్వర్యంలో 1959 అక్టోంబర్ 11వ తేదీన అప్పటి ప్రధాన మంత్రి నెహ్రు చేతుల మీదుగా వనపర్తిలోని రాజభవనంలో పాలిటెక్నికల్ కళాశాలను ప్రారంభించారు. ఏడాది తర్వాత దీనిని 1960సంవత్సరంలో పాలిటెక్నికల్ కళాశాలను ప్రభుత్వానికి అప్పజెప్పారు. నాటినుంచి ఎంతోమంది విద్యార్థులు ఇక్కడ చదువుకోవడానికి వచ్చేవారు. శ్రీలంక, నేపాల్, భూటాన్ తదితర దేశాల నుంచి కూడా వచ్చేవారు. రాజభవనం వెనుకాల పాలిటెక్నిక్ కళాశాలలో చదువుకొనే విద్యార్థుల కోసం వసతి గృహాలను కూడా ఏర్పాటు చేశారు. దాదాపు రాజాభవనం 24ఏకరాల విస్తీర్ణంలో ఉన్నది.
రూ.22కోట్లతో రాజాభవనం మరమ్మతులు
రాజభవనం, పాలిటెక్నికల్ కళాశాలకు పూర్వవైభవం తీసుకురావాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సీఎం కేసీఆర్తో రూ. 22కోట్లు నిధులను మంజూరు చేయించారు. వెంటనే భవనంలోని శిథిలావస్థలో ఉన్న వాటికి మరమ్మతులు చేపట్టేలా ప్రణాళికలను రూపొందించారు. అలాగే పాలిటెక్నికల్ హాస్టల్ భవనాలను కూడా మరమ్మతు చేపట్టి విద్యార్థులకు వసతులను సమకూర్చాలని ఆదేశాలను జారీ చేశారు. ఇప్పటికే పాలిటెక్నికల్ రాజాభవనం ఆవరణలోని గరుడ పుష్కరిణి మరమ్మతులు చేపట్టారు. ఆవరణలోని మైదానాన్ని విశాలంగా చేపట్టి వనపర్తి ప్రజలు రోజువారీగా వాకింగ్ చేసేందుకు ట్రాక్ను ఏర్పాటు చేశారు. రాజాభవనం ముఖద్వారం వద్ద వెల్కం వనపర్తి బోర్డులతోపాటు గార్డెనింగ్ సుందరీకరించారు. రానున్న రోజుల్లో రాజాభవనం పరిసరాలను మైసూర్ ప్యాలెస్ మాదిరిగా గార్డెనింగ్ చేయించి, ఉమ్మడి జిల్లాకే తలమానికంగా తయారు చేయిస్తామని మంత్రి మాటిచ్చారు.
రాజభవనాన్ని పునరుద్ధరిస్తాం
వందేళ్లకు పైబడిన చరిత్రగల వనపర్తి రాజాభవనం కాలక్రమంలో పోషణ లేక కొంత భవనం దెబ్బతిన్నది. దాంతోపాటు విద్యార్థుల వసతిగృహాల నిర్మాణానికి సీఎం కేసీఆర్తో చర్చించి రూ. 22 కోట్ల నిధులను మంజూరు చేయించడం జరిగింది. చారిత్రక భవనాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది. ఇది అరుదైన నిర్మాణ శైలిగల భవనం, అత్యంత వైభవోపేతంగా పునరుద్ధరించాల్సిన సమయం అసన్నమైంది. ఇది వనపర్తి కీర్తికి కిరీటంలా నిలిచిపోయేలా రూపొందించుకుందాం. ఈ రాజాభవనాన్ని రానున్న తరాలకు అందిందాం. మైసూర్ రాజా ప్యా లెస్ మోడల్గా వనపర్తి రాజాభవనం ఆవరణంలో స్థలాన్ని గార్డెనింగ్ చేసి పూర్తిస్థాయిలో భవనాన్ని పునరుద్ధ్దరించి వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– నిరంజన్రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి
సంస్కృతి చిహ్నాలను కాపాడడం సంతోషకరం
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో రాష్ట్రంలోని చాలా పురాతన చిహ్నాలను ప్రభుత్వం కాపాడుతూ వాటికి పూర్వవైభవం తీసుకొస్తున్నది. అందులో భాగంగా వనపర్తి రాజాభవనం మరమ్మతుల కోసం మంత్రి నిరంజన్రెడ్డి ప్రత్యేక నిధులు తీసుకురావడం చాలా సంతోషకరమైన విషయం. అప్పట్లో రాజా భవనాన్ని రంగు మహాల్ అని పిలిచే వారు. సంస్థ అధికార చిహ్నంగా ముఖద్వారంలో పైన గరుడ పక్షి ఉంటుంది. వనపర్తి సంస్థ చరిత్రను కాలగర్భంలో కలిసి పోకుండా మంత్రి చేస్తున్న అభివృద్ధి వనపర్తి ప్రజలు సంతోషిస్తున్నారు.
– శ్రీనివాసులు, సిటిజన్ ఫోరం కన్వీనర్, వనపర్తి