నారాయణపేట, డిసెంబర్ 28: జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా పోలీస్ యంత్రాంగం విధులు నిర్వహిస్తుందని ఎస్పీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వా ర్షిక నివేదికను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది పోలీస్స్టేషన్లో ఫ్రీ రిజిస్ట్రేషన్ ఏర్పాటు చేయడం వలన గత ఏడాది కన్నా ఈ సారి కేసుల సంఖ్య పెరిగిందన్నారు. కోర్టులో శిక్షల శాతం పెరిగితేనే నేరాలు చేయడానికి భయపడుతారని, శిక్షల శాతం పెంచేలా పోలీసులు సమన్వయంతో పనిచేస్తున్నట్లు చెప్పారు. పోలీసులు సమీక్షా సమావేశాలు నిర్వహించుకునేందుకు రూ.25లక్షలతో కాన్ఫరెన్స్ హాల్ నిర్మించినట్లు చెప్పారు. షీ టీమ్స్ ద్వారా రద్దీ ప్రదేశాలు, పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మహిళల రక్షణకు కృషి చేస్తున్నామన్నారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం 10మంది కానిస్టేబుళ్లకు ప్రత్యేక శిక్షణ అందించి పట్టణంలో 8మందిని, మక్తల్ పట్టణంలో ఇద్దరిని నియమించామన్నారు.
వచ్చే ఏడాది దొంగతనాల నిర్మూలన, మత్తు పదార్థా లు, బియ్యం, పశువులు, ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఎర్రగుట్ట వద్ద శాశ్వత చెక్పోస్టు ఏర్పాటు, పట్టణంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటుకు చర్యలు చేపడతామన్నారు. రూ. 38కోట్లతో 15 ఎకరాల స్థలంలో డీపీవో కార్యాలయం, రూ. 2.79లక్షలతో పేట రూరల్ పోలీస్ స్టేషన్, రూ.2.79లక్షలతో ధన్వాడలో పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు నిధులు మంజూరయ్యాయని, వాటి నిర్మాణాలు త్వరలో చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి ఎంపీ నిధుల నుంచి నారాయణపేట, మక్తల్కు రూ.10లక్షల చొప్పున నిధులు మంజూరు చేశారని, ఆ నిధులతో నాణ్యమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నా రు.
పోలీస్శాఖ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందు కు ప్రజలు, వ్యాపార సంస్థలు, వివిధ సంఘాల వారు ముందు కు వచ్చి విరాళాలు అందజేయాలని కోరారు. విరాళాలు ఇచ్చేవారికి ఆదాయపన్ను నుంచి వినహాయింపు ఉంటుందన్నారు. నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని, రాత్రి 8గంటల నుంచే జిల్లాలో డ్రంకెన్డ్రైవ్ తనిఖీలు చేపడుతామన్నారు. వచ్చే ఏడాదిలో స్నేహపూర్వక పోలీస్ విధానాన్ని అవలంబిస్తూ, పారదర్శకమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.