కోడేరు, జనవరి 30 : భూమిని విరాసత్ చేసేందుకు రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఓ రెవెన్యూ అధికారి ఏసీబీ వలలో చిక్కిన ఘటన సోమవారం నాగర్కర్నూల్ జిల్లా కోడేరు రెవెన్యూ కార్యాలయంలో చోటు చేసుకున్నది. ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్ కథనం మేరకు.. కోడేరు మండలంలోని రాజాపూర్ గ్రామానికి చెందిన చీకిరాల వెంకయ్య గతంలో మృతి చెందాడు. అతని పేరుమీద కోడేరు మండలంలోని రేకులపల్లి గ్రామ శివారులో 1.12 ఎకరాలు ఉన్నది. ఆ భూమిని తన పేరుమీద విరాసత్ చేయాలని వెంకయ్య కుమారుడు చీకిరాల సాయిబాబు గతేడాది జూలై 16న మీసేవలో దరఖాస్తు చేసుకున్నాడు.
అప్పటి నుంచి రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు విరాసత్ చేయలేదు. దీంతో విసుగుచెంది కలెక్టరేట్లోని ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. కలెక్టరేట్లోని అధికారులు సమస్యను పరిష్కరించాలని కోడేరు తాసిల్దార్, డిప్యూటీ తాసిలార్లను ఆదేశించారు. అయినా డీటీ పురుషోత్తం కాలయాపన చేస్తూ వచ్చాడు. పని చేయాలంటే రూ.15 వేలు లంచం ఇవ్వాలని 20 రోజుల కిందట చీకిరాల సాయిబాబుకు డీటీ చెప్పాడు. చివరకు రూ.10 వేలు ఇస్తానని ఒప్పుకొన్నారు. కాగా, నాలుగు రోజుల కిందట సాయిబాబు, అతని అన్న కుమారుడు చీకిరాల నాగేంద్రం కలిసి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.
సోమవారం మధ్యాహ్నం డిప్యూటీ తాసిల్దార్ పురుషోత్తంకు నాగేంద్రం రూ.10 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. పట్టుబడిన డబ్బులను రికవరీ చేసి విచారణ చేస్తున్నామని, మంగళవారం ఉదయం నాంపల్లి స్పెషల్ కోర్టులో డీటీని హాజరు పరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే 1064 టోల్ఫ్రీ నెంబర్, 9491305609 నెంబర్లను సంప్రదించాలని సూచించారు. ఈ దాడిలో ఉమ్మడి మహబూబ్నగర్ ఇన్స్పెక్టర్ లింగస్వామి, నల్గొండ ఇన్స్పెక్టర్ వెంకట్రావు, సిబ్బంది పాల్గొన్నారు.