మత్స్యకారులకు సర్కారు చేయూతనందిస్తున్నది. వారి ఆర్థికాభివృద్ధి కోసం ఎన్నో రకాల సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతున్నది. స్వయం ఉపాధి కోసం ఉచిత చేపపిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టింది. నాటి నుంచి చెరువులు, రిజర్వాయర్లు, కుంటల్లో మత్స్యసిరులు కురుస్తున్నాయి. గత వానకాలం సీజన్లో జిల్లాలోని 1,137 చెరువుల్లో 1.93 కోట్ల చేపపిల్లలు వదలగా రూ.80 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ఏడాది నాగర్కర్నూల్ జిల్లాలోని 1210 చెరువులు, ఆరు రిజర్వాయర్లలో 2.60 కోట్ల చేపపిల్లలను వదిలేందుకు సర్కారు సన్నాహాలు చేస్తున్నది. ఆగస్టు మొదటి వారంలో విడిచిపెట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాంట్రాక్టర్లకు టెండర్లు ఖరారు చేశారు.
కందనూలు, జూలై 2 : మత్స్యకారులు ఆర్థికంగా ఎదగడానికి తెలంగాణ ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. ప్రధానంగా మత్స్యకారులకు స్వయం ఉపాధి కోసం ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో కులవృత్తులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈక్రమంలో నాగర్కర్నూల్ జిల్లాలో ఈసారి 2కోట్ల60లక్షల చేపపిలల్లను చెరువుల్లో వదలడానికి మత్స్యశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ వానకాలంలో జిల్లా వ్యాప్తంగా చెరువుల్లో నీటి శాతం ఎంత ఉంది? చేపపిల్లలు వదలడానికి అనుకూలంగా ఉన్న చెరువులేవీ? అనే అంశాలను పరిశీలిస్తున్నారు. ఇక అన్నీ అనుకూలిస్తే జూలై చివరి వారం లేదా ఆగస్టు మొదటివారంలో చేపపిల్లలను వదలనున్నారు. మిషన్ కాకతీయ ద్వారా పూడికతీతతో ప్రతి గ్రామంలోని చెరువులో నీరు పుష్కలంగా ఉండడంతోపాటు చేపపిల్లల పెంపకానికి అనుకూలం కానుంది.
జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో మొత్తం 1,210 చెరువులున్నాయి. అచ్చంపేటలో 300, కల్వకుర్తిలో 130, కొల్లాపూర్లో 450, నాగర్కర్నూల్లో 336 చెరువులు ఉన్నాయి. ఇక జిల్లాలో 6 రిజర్వాయర్లు ఉండగా.. ప్రధానంగా గుడిపల్లి రిజర్వాయర్, జొన్నలబొగుడ, వెంకటాద్రి రిజర్వాయర్లతోపాటు చిన్నాపెద్ద కాల్వల్లో నీరు పుష్కలంగా ఉన్నది. జిల్లా పరిధిలో 223 సంఘాలు ఉండగా 16,012మంది మత్స్యకారులు ఉన్నారు. వీరిలో 11 మహిళాసంఘాలు ఉండగా 451మంది సభ్యులు ఉన్నారు.
ప్రధానంగా మత్స్యకారులు ఏ వాతావరణంలో అయినా పెరిగే బొచ్చె, రవ్వ, బంగారుతీగ, మెరిగె రకాలను మత్స్యకారులకు అందిస్తున్నారు. ఇక ప్రభుత్వం చేప పిల్లలకు అవసరమైన దాణాను కూడా ఉచితంగా అందిస్తుండడంతో మత్స్యకారుల్లో ఆనందం నెలకొన్నది.
చేపపిల్లలను చెరువుల్లో వదలడానికి వానకాలం అనువైన సమయమని ప్రభుత్వం గుర్తించింది. నీరు సమృద్ధిగా ఉన్న సమయంలోనే చేపలను చెరువుల్లో వదలాలి. గత వానకాలంలో నాగర్కర్నూల్ జిల్లాలోని 1,137 చెరువుల్లో కోటీ 93లక్షల విలువైన చేపపిల్లలను విడుదల చేయగా 14,565 టన్నుల దిగుబడి రాగా.. దాదాపు రూ.80 కోట్ల ఆదాయం వచ్చింది.
పెరిగిన నీటి వనరులను దృష్టిలో ఉంచుకుని ఈ ఏ డాది 1,210 చెరువుల్లో చేపపిల్లలను వదలనున్న ట్లు మత్స్యశాఖ అధికారులు తెలిపారు. 6 రిజర్వాయర్లలో కలిపి సుమారు 2కోట్ల 60 లక్షల చేప పిల్లలను వదులనున్నారు. ప్రధానంగా నీరు సమృద్ధిగా ఉన్న తరుణంలో, కృష్ణాజలాలు చెరువు లు, కాల్వల్లో పారుతుండడంతో లక్ష్యం సులభంగా నెరవేరనున్నది. రొయ్యలను గ తంలో వదిలి మంచి ఫలితాలు పొందడంతో ఈసారి కూడా వదలనున్నారు. టెండర్లు పూర్తవడంతో టెండరుదారులు ఆగస్టు మొదటి వారం వరకు చేపపిల్లలను సరఫరా చేయనున్నారు.