నాగర్కర్నూల్ (నమస్తే తెలంగాణ)/ వనపర్తి టౌన్/రాజోళి, మార్చి 21: తెలుగు ప్రజల కొత్త సంవత్సర ఆరంభ పండుగ ఉగాది.యుగం ఆరంభమైన తొలిరోజుగా పిలవబడే ఈ పండుగకు ఆనందోత్సాహాలతో జరుపుకొనేందుకు ఉమ్మడి జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. ఆధ్యాత్మికతతో పాటు మానవ జీవితంలో జరిగే ఘట్టాలను స్ఫురింపజేసే ప్రాముఖ్యతనూ తెలియజేసే పచ్చడి ఈ పండుగ ప్రాధాన్యత. అలాంటి ఉగాది ఈసారి శోభకృత్ నామ సంవత్సరంగా పిలువబడనున్నది.
తెలుగు ప్రజలు బుధవారం శోభకృత్ నామ సంవత్సరంలోకి అడుగిడను న్నారు. కొత్త ఏడాది ప్రారంభాన్ని సూచిస్తూ వసంత మాసం ఛైత్ర శుద్ధ పాడ్యమి రోజు జరుపుకోనే పండుగ ఉగాది. ఉగ అంటే నక్షత్ర గమనం, నక్షత్ర గమానికి ఆది అంటే సృష్టి ఆరంభమైన రోజే యుగాది(ఉగాది)గా భావిస్తుంటా రు. ఇక బ్రహ్మదేవుడు యుగాది రోజు తెల్లవారుఝామున సృష్టిని సృష్టించాడని, వేదాలను సోమకుడు అనే రాక్షసుడు తస్కరించడంతో విష్ణువు మత్స్యావతారంతో సంహరించి తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన రోజే ఉగాది అని కథనం. అలాగే శ్రీరాముడు, విక్రమాదిత్యుడు, శాలివాహ నులు ఇదే రోజు పట్టాభిషిక్తులయ్యరని, ఈరోజు వరాహమిహిరుడు పంచాం గాన్ని జాతికి అంకితం చేశాడనేది మరో కథనం. తెలుగు సంవత్సరాలు పేర్లు నారదుడి సంతానం అని కొందరంటుంటే, దక్షప్రజాపతి 60మంది కుమార్తెల పేర్లని మరి కొందరు భావిస్తుంటారు. వీటి ప్రకారం ఇప్పటి వరకు శుభకృత్ నామ సంవత్సరం కాగా బుధవారం నుంచి శోభకృత్ నామ సంవత్సరం ప్రారంభం కానుంది.
ఉగాది పండుగ ప్రకృతితో సమ్మిళితమైంది. ఈ రోజు ప్రజలందరూ ఇండ్లను శుద్ధి చేసి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి తమ ఇష్ట దేవుళ్లను పూ జిస్తారు. ఈ రోజు ప్రకృతిలో లభించే వేప పువ్వు, మామిడి, కొబ్బరి తదితర షడ్రుచులతో పచ్చడి తయారు చేసి తింటారు.
సాయంత్రం ఆలయాల్లో వేద పండితులు పంచాంగం చదివి వినిపిస్తారు. ఈ సందర్భంగా కొత్త సంవత్సరంలో వ్యవసా యం, వర్షాలు, రుతువులు, వాతావరణంలో ఎలాంటి మార్పులు వస్తాయనేది పండితులు వివరిస్తారు. అలాగే వ్యక్తుల రాశుల ప్రకారం ఈ సంవత్సరంలో ఎలాంటి కష్ట సుఖాలు ఉంటాయనేది పండితులు పంచాంగంలో చూసి వివరిస్తారు.