మహబూబ్నగర్ మెట్టుగడ్డ, డిసెంబర్ 16: పోలీసు కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల భర్తీకి నిర్వహిస్తున్న ఈవెంట్లు సజావుగా కొనసాగుతున్నాయి. శుక్రవారం జిల్లాకేంద్రంలోని స్టేడియంలో ఉదయం 5గంటలకే దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని నాగర్కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలో పురుష అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 977మందికిగానూ 684మంది హాజరయ్యారు. వీరిలో 332మంది అభ్యర్థులు తర్వాత ఈవెంట్స్కు ఎంపికయ్యారు. ఎగ్జామ్స్ చీఫ్ సూపరింటెండెంట్లు, ఎస్పీలు వెంకటేశ్వర్లు, చేతన ఈవెంట్లను పర్యవేక్షించారు. సీసీ కెమెరాల నిఘా, ఆధునిక టెక్నాలజీ సాయంతో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. నోడల్ ఆఫీసర్గా అదనపు ఎస్పీ రాములు, సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కోసం ఏఈవో కృష్ణయ్య, డీపీవో సిబ్బంది, అధికారులు ఏర్పాట్లు చేశారు.