కొవిడ్ ఫియర్ మొదలైంది. 2020-21 ఏడాదిలో రెండు సార్లు మరణమృదంగంతో యావత్ ప్రపంచాన్ని వణికించిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్ జేఎన్-1 మళ్లీ చాపకింద నీరులా విస్తరిస్తున్నది. దీంతో దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలతో ఉమ్మడి జిల్లాలోనూ యంత్రాంగం అప్రమత్తమైంది. మహబూబ్నగర్, వనపర్తి, నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రధాన దవాఖానల్లో మహిళలు, పురుషుల కోసం వేర్వేరుగా ప్రత్యేక వార్డులను సిద్ధం చేసింది.
వనపర్తి, డిసెంబర్ 26 : దేశంలోకి కరోనా రిటర్న్స్ అయ్యింది. మరోసారి విజృంభిస్తుండడంతో కరోనా కేసులు పెరుగుతున్నాయి.పలు రాష్ర్టాల్లో వైరస్ తన స్వరూపాన్ని మార్చుకుంటూ కరోనా కొత్త వేరియంట్ జేఎన్-1గా వెలుగులోకి వచ్చింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. దవాఖానల్లో ప్రత్యేక వసతుల కల్పన దిశగా ఆదేశాలు జారీ చేశాయి. గతంలో విజృంభించిన ఫస్ట్, సెకండ్ వేవ్లను దృష్టిలో పెట్టుకొని వైద్య శాఖ ప్రజలను అవగాహన కల్పిస్తున్నది. జాగ్రత్తలు పాటించాలని, స్వీయ రక్షణతోనే కట్టడి సాధ్యమని వివరిస్తున్నది.
వనపర్తి జిల్లా వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. కరోనాను దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలు చేపట్టారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. 62 బెడ్లకు అనుసంధానంగా ఆక్సిజన్ సదుపాయాలను కల్పించారు. పరిస్థితి విషమంగా ఉన్నవారి కోసం ఇందులోనే 12 ఐసీయూ బెడ్లను సిద్ధంగా ఉంచారు. అలాగే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, బెడ్సైడ్ కాన్సన్ట్రేటర్లు, ఆర్టీసీసీఆర్ కిట్లు, మందులను సిద్ధం చేసి ఉంచారు. భవిష్యత్లో వచ్చే పరిస్థితులను ఎదుర్కొనేందుకు వైద్యాధికారులు సన్నద్ధమవుతున్నారు. మెరుగైన చికిత్సలు అందించేందుకు లిక్విడ్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, అలాగే ప్రత్యేకంగా ఆక్సిజన్ యూనిట్ అందుబాటులో ఉన్నది. సేవలందించేందుకు వైద్యులు, నర్సింగ్, సాంకేతిక, సహాయ, శానిటేషన్ సిబ్బందిని కేటాయించేలా సిద్ధంగా ఉన్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశారు. ఇన్పేషెంట్స్, గర్బిణులను ప్రత్యేకంగా పరీక్షిస్తున్నారు. కొత్త వేరియంట్ లక్షణాలు తెలుసుకునేందుకు రోగుల నుంచి సేకరించిన నమూనాలకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు ఇక్కడే నిర్వహిస్తున్నారు. ప్రజలు సోషల్ డిస్టెన్స్, మాస్క్ ధరించడం, శానిటైజర్తో కానీ సబ్సుతో కానీ చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు.
కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. సోషల్ డిస్టెన్స్ పాటించాలి, మాస్క్ ధరించాలి, చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలి. సాధారణంగా జలుబు, దగ్గు, ఒంటి నొప్పులు వస్తే భయపడిపోకుండా వైద్యులను సంప్రదించాలి. జేఎన్-1 లక్షణాలు ఉంటే దవాఖానల్లోని ప్రత్యేక వార్డుల్లో చికిత్స అందిస్తాం. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం