అలంపూర్, ఫిబ్రవరి 16 : రాష్ట్రంలో ఏకైక శక్తి పీఠమైన అలంపూర్ జోగుళాంబబాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో మహాశివరాత్రి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈనెల 17 నుంచి 21వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఉత్సవాలను తిలకించేందుకు తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ర్టాల భక్తులు కూడా తండోపతండాలుగా తరలివస్తారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు, అదనపు ప్రసాద కౌంటర్లు, సిబ్బంది, అర్చకులు, తాగునీరు, పార్కింగ్ సౌకర్యం, చలువ పందిళ్లు, ఉచిత అల్పాహారం వంటి ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. మహాశిరాత్రిని పురస్కరించుకుని బాలబ్రహ్మేశ్వర స్వామికి రుద్రాభిషేకం, పూజలు, కల్యాణోత్సవం మొదలగు ఆర్జిత సేవల్లో పాల్గొనాలనుకున్న భక్తులు ఆలయ కౌంటర్లో, ఆన్లైన్లో రుసుం చెల్లించాలని ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, ఈవో పురేందర్కుమార్ కోరారు. మహాశివరాత్రి రోజున బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం శిఖరం పై భాగంలో మాలధారణ చేపట్టిన శివస్వాములతో ఆకాశజ్యోతి వెలిగిస్తారు. ఈ జ్యోతిని దర్శించుకుంటే సకల శుభాలు కల్గుతాయని భక్తుల నమ్మకం. మాలధారులు జ్యోతి దర్శనం తర్వాత మాలవిసర్జన చేస్తారు. శివరాత్రి రోజున భక్తులు జాగారం చేసేందుకు వీలుగా ఆలయ పరిసరాల్లో ప్రత్యేక సాంసృ్కతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.