మహబూబ్నగర్, ఆగస్టు 6 : మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకున్నది. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులు నిండుకుండల్లా మారాయి.
దీంతో ఈనెల రెండు, మూడు వారాల్లో చేపపిల్లలను వదిలేందుకు మత్స్యశాఖ ప్రణాళికలను రచిస్తోంది. ఈమేరకు ఇప్పటికే చేప పిల్లల సరఫరా ప్రక్రియకు సంబంధించి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది.
చేపలకు పెరిగిన గిరాకీ..
మార్కెట్లో టమాట ధర అంతకకంతకూ పెరుగుతుండగా మిగతా కూరగాయలు సైతం మండుతున్నాయి. మటన్ కేజీ రూ.750 ఉండగా చికెన్ ధర పెరుగుతూ తగ్గుతూ వస్తోంది. చేపలకు మాత్రమే ధర స్థిరంగా కొనసాగుతున్నది. కొర్రమీను కిలో రూ.300, బొచ్చె, బంగారుతీగ, గౌట, రౌట, కంచె రకం చేపలు కిలో రూ.100 లోపు పలుకుతున్నాయి. రిజర్వాయర్ల వద్ద అయితే కిలోకు రూ.50 నుంచి రూ.80కే అందుతున్నాయి. ఈమధ్య ప్రజలు అధికంగా చేపలను కొనుగోలు చేస్తున్నట్లు మత్స్యకారులు చెబుతున్నారు.
38 చెరువులలో నీళ్లు ఫుల్..
మహబూబ్నగర్ జిల్లాలో ప్రధానమైన రిజర్వాయర్ కోయిల్సాగర్. ఈ ప్రాజెక్టు వరదతో నిండు కుండలా మారింది. దీంతోపాటు 140 పెద్ద చెరువులు ఉండగా 944 చెరువులు, కుంటలు ఉన్నాయి. మొత్తం 1,085 చెరువులు ఉండగా 38 చెరువులు వంద శాంతం నిండి అలుగు పారుతున్నాయి. మిగతా చెరువులు, కుంటల్లో 60-70శాతం నీరు ఉన్నది. వీటిలో కోటీ 94లక్షల చేపపిల్లలను వదిలేందుకు చర్యలు తీసుకుంటున్నారు.