గద్వాల టౌన్, జనవరి 1 : ముక్కోటి ఏకాదశికి వేళైంది. వైష్ణవ భక్తులకు ఈ పర్వదినం ఎంతో పవిత్రమైనది. ఈ రోజు ఉత్తర ద్వారం నుంచి స్వామిని దర్శించుకుంటే సకల పాపాలు పోతాయని నమ్మకం. అలాగే ఏకాదశి వ్రతాన్ని కూడా భక్తులు ఆచరిస్తారు.
పురాణ ప్రశస్థి
కృత యుగంలో చంద్రావతి నగరాన్ని రాజధానిగా చేసుకొని మురాసురుడనే రాక్షసుడు పాలించే వాడు. బ్రహ్మదేవుడి వరంతో మురాసురుడు మహర్షుల యజ్ఞాలను ధ్వంసం చేసేవాడు. చివరికి దేవతలనూ వదిలి పెట్టకుండా వేధించేవాడు. దీంతో వారంతా కలిసి విష్ణువుతో మొరపెట్టుకున్నారు. మహావిష్ణువు మురాసురుడిపై యుద్ధానికి వెళ్లాడు. కానీ మురాసురుడిని సంహరించడం విష్ణువుకు సాధ్యం కాదు అలసిపోయిన హరి బదరికా ఆశ్రమంలో విశ్రాంతి తీసుకునేందుకు ఉపశమించాడు.
ఆ సమయంలో స్వామి శరీరంలో నుంచి ఏకాదశి కన్య ఉద్భవించి మురాసురునిడితో యుద్ధం చేసి వధించింది. కన్య ధైర్యాన్ని మెచ్చుకున్న స్వామి ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. దీంతో కన్య తన పేరుపై ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఏకాదశి రోజు వ్రతం ఆచరించి శ్రీమన్నారాయణుడిని కొలుస్తారో వారికి మోక్షంతో వైకుంఠ ప్రాప్తి కలింగించమని కోరిందంట. అందుకే భక్తులు ఉపవాసం.. భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరిస్తారు.
ఉత్తర ద్వారం విశిష్టత
ఉత్తర ద్వారమనగానే దైవాన్ని ఉత్తర దిక్కుగా కూర్చుండబెట్టి దర్శనం కలిగించడమని భావిస్తారు. కానీ అది నిజమైన దర్శనం కాదంటారు పండితులు. ఉత్తరాయణంలో శరీరంలో ఏ బ్రహ్మ రంధ్రం అయితే ఉందో(మాడు) ఆ మధ్య భాగంలో పరమేశ్వరుడు ఉంటాడని. ఆ పరమేశ్వరుడి దర్శనం బ్రహ్మ రంధ్ర స్థానంలో ఉండే ఉత్తర ద్వార దర్శనమని పండితులు చెబుతున్నారు. బ్రహ్మ రంధ్రం రెండు తలుపులతో ఇమిడి ఉంటుందని, ఈ రెండు తలుపులు తెరిస్తే యోగి పుంగవులకు భగవంతుడి దర్శనమవుతుందని, అది కేవలం ఈ మార్గశిర మాసంలోనే వస్తుందని చెబుతారు. దీన్నే ఉత్తర ద్వార దర్శనమని అంటారు. అలాగే ఇంకో కథనం ఉన్నది. ధనుర్మాసంలో స్వామిని ఉత్తర ద్వారముఖంగా చూడాలని పెద్దలు సూచిస్తారు. దేవాలయంలో ఉత్తరం వైపు ద్వారాన్ని తెరిచి ఆ ద్వారం ఎదురుగా స్వామి ఉత్సవమూర్తులను అలంకరించి తెల్లవారుజాము నుంచే స్వామిని కొలుస్తారు.
ముస్తాబైన ఆలయాలు
ఉత్తర ద్వార దర్శనం వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని సోమవారం ఉమ్మడి జిల్లాలోని వైష్ణవాలయాలు ముస్తాబయ్యాయి. గద్వాల కోటలోని శ్రీ భూలక్ష్మీ చెన్నకేశవస్వామి, బుర్ధాపేటలోని గోదారంగనాథ స్వామి, పెద్ద అగ్రహారంలోని శ్రీలక్ష్మీ నృసింహ స్వామి ఆలయం, గంజిపేటలోని వేంకటేశ్వరస్వామి, నది అగ్రహారంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయాలతోపాటు బీచుపల్లి, అలంపూర్, ధరూర్, మల్దకల్, అయిజ మండలాల్లోని వైష్ణవాలయాల్లో ఉదయం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు విశేష అభిషేక పూజలతోపాటు ఉత్తర ద్వార ప్రవేశం ఉంటుంది. అలాగే తిరుప్పావై పారాయణం, పొంగళి నివేదన, ఆర్తి, గోష్ఠి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.