మహబూబ్నగర్, జనవరి 28 : దేశంలో ఎక్కడా లేని విధంగా అంగన్వాడీ టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం వేతనాలు అందిస్తున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని రాయల్ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ జిల్లా సమీక్షా సమావేశానికి మంత్రి హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా మహబూబ్నగర్ రూరల్, అర్బన్ ప్రాజెక్టుల పరిధిలో 16మంది టీచర్లు, ఆయాలకు నియామకపత్రాలను మంత్రి శ్రీనివాస్గౌడ్ అందజేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి ఇంటి సమస్య అంగన్వాడీ టీచర్కు ముందుగానే తెలుస్తుందని, వాటిని బాధ్యతగా పరిష్కరించే ప్రయత్నం చేయాలని సూచించారు.
ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడి వారికి చేయూతనిచ్చే గొప్ప అవకాశం అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు ఉన్నదని చెప్పారు. నూతనంగా ఉద్యోగాలు పొందిన వారితోపాటు పనిచేస్తున్న వారందరూ ప్రజలకు చేరువగా ఉంటూ సేవలు అందించాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. నిబద్ధతతో పనిచేయడంతో రాబోయే రోజుల్లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారన్నారు. ప్రతి సమస్యనూ పరిష్కరించుకుంటూ ముందుకు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. పౌష్టికాహారం సమృద్ధిగా పంపిణీ చేయాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వీడి బాధ్యతగా ఉండాలని, అప్పుడే మంచి గుర్తింపు వస్తుందని చెప్పారు. ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీడబ్ల్యూవో జరీనాబేగం, ఎంపీపీ సుధాశ్రీ, సీడీపీవోలు శాంతిరేఖ, రాజేశ్వరి, శైలశ్రీ, నెహర్ఉన్సీసా, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.
ప్రగతిలో గ్రామాలు పోటీ
మహబూబ్నగర్ టౌన్, జనవరి 28 : తెలంగాణలోని గ్రా మాలు ప్రగతిలో పోటీపడుతున్నాయని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. శనివారం మహబూబ్నగర్ మున్సిపాలిటీలోని 15వ వార్డు పరిధిలోని చిన్నధర్పల్లి, లక్ష్మణ్ నాయక్తండా రూ.81 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో గ్రామాలంటే దుర్గంధం, అపరిశుభ్రంగా ఉండేవని, కానీ నేడు ప్రభుత్వం తీసుకున్న చర్యలతో స్వచ్ఛ పల్లెలుగా మారాయన్నారు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైయిన్లు, తాగునీటి సౌకర్యం, జీపీలకు ట్రాక్టర్లు, నర్సరీలు, పల్లెప్రకృతి వనాలతో ఆహ్లాదంగా.. సుందరంగా మారాయన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్, కౌన్సిలర్ లతశ్రీ, నాయకులు లక్ష్మణ్నాయక్, ఎంఈ సుబ్రమణ్యం, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.