ఆస్తి పన్ను వసూళ్లు లక్ష్యం దిశగా సాగుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి ప్రత్యక్షంగా ఫలితాలనిస్తున్నది. దీంతో ప్రజల్లోనూ అవగాహన పెరిగి పన్నుల చెల్లింపునకు ముందుకొస్తున్నారు. గతంలో మార్చి వస్తుందంటే పన్ను వసూళ్ల లక్ష్యం సాధించేందుకు పంచాయతీ అధికారులు భయపడే పరిస్థితులు మాయమయ్యాయి. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యేల పిలుపుతో పాటు కింది స్థాయిలో సర్పంచులు, ఎంపీటీసీల్లాంటి నాయకులసహకారంతో ప్రజలు స్వచ్ఛందంగా పన్ను చెల్లిస్తున్నారు. దీంతో పంచాయతీ శాఖాధికారులు సులువుగా వంద శాతం లక్ష్యం చేరేలా ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నారు.
– నాగర్కర్నూల్, మే 14 (నమస్తే తెలంగాణ)
నాగర్కర్నూల్, మే 14 (నమస్తే తెలంగాణ) : గ్రామాల్లో పన్నుల వసూళ్లు వంద శాతం దిశగా సాగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మార్చి చివరి నాటికి ఆస్తి పన్ను వసూళ్లను పూర్తి చేసేందుకు పంచాయతీ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆయా మండలాల ఎంపీడీవోలు.. పంచాయతీ కార్యదర్శులతో నిరంతరం పర్యవేక్షిస్తూ గ్రామాల్లో ఆస్తి పన్ను వసూళ్లు పూర్తి చేసేందుకు ప్రజలకు అవగాహన కల్పించారు. దీంతో ఆశించిన స్థాయిలో స్పందన వస్తున్నది. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నది. పల్లె ప్రగతి కార్యక్రమంతో ప్రతి సీజన్లో ఏడాదికి రెండుసార్లు పారిశుధ్య పనులు చేపడుతున్నారు. ఇక గ్రామాల్లో నర్సరీలు, పంచాయతీలకు, ఇతర కార్యాలయాలకు భవనాల నిర్మాణం, గ్రామాల్లో నర్సరీలు, చెత్త సేకరణ, నీళ్ల కోసం ట్రాక్టర్లను కేటాయించారు. డంపింగ్ యార్డులు, వైకుంఠ ధామాలు, బృహత్ పల్లె వనాలు, క్రీడా ప్రాంగణాలు, మిషన్ భగీరథ నుంచి ఇంటింటికీ శుద్ధ జలం, చెరువులు, కుంటల అభివృద్ధి, సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం వంటి అభివృద్ధి కండ్ల ఎదుట కనబడుతున్నది.
ఈ పనుల కోసం గతంలో మాదిరి కాకుండా ప్రతినెలా ప్రభుత్వం నిధులను పంచాయతీ ఖాతాల్లో జమ చేస్తున్నది. దీంతో పనుల నిర్వహణకుగానూ పంచాయతీలకు నిధుల కొరత లేదు. ఫలితంగా గ్రామాల్లో సమైఖ్య పాలనతో పోలిస్తే అభివృద్ధి నిరంతరం జరుగుతున్నది. దీంతో పల్లెలు వివిధ విభాగాల్లో ఆదర్శ గ్రామాలుగా రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు సాధిస్తున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కలెక్టర్, అధికారులు నిరంతరం జిల్లాల్లోని ఏదో ఒక గ్రామాల్లో పర్యటిస్తూ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొంటున్నారు. ఇది తమ గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు తెలియజేస్తున్నది. ఈ అభివృద్ధి పనులకు ప్రజలు ఆస్తి పన్ను సకాలంలో చెల్లించాలనే అధికారులు, నేతల మాటలు సైతం ప్రభావం చూపిస్తున్నాయి.
గతంలో ఆస్తి పన్నుల వసూళ్లు అధికారులకు కత్తి మీద సాములా మారేది. మార్చి నెల వస్తే అధికారులు భయపడే పరిస్థితులు ఉండేవి. కార్యదర్శులు షోకాజ్ నోటీసులకూ గురయ్యేవారు. ఇప్పుడు ఆ పరిస్థితులు దూరమయ్యాయి. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధిని చూసిన ప్రజలు ఆస్తి పన్ను చెల్లించేందుకు స్వచ్ఛందంగా సహకరిస్తున్నారు. మొత్తం ఆస్తి పన్ను లక్ష్యం రూ.7 కోట్లు ఉండగా రూ.5.50 కోట్ల వరకు పన్నులు వసూలయ్యాయి. అత్యధికంగా 95 శాతంతో పెంట్లవెల్లి, పెద్దకొత్తపల్లి మండలాలు ఉండగా చారకొండలో అత్యల్పంగా 55 శాతం వసూలయ్యాయి. ఏప్రిల్ నెలాఖరుకు వంద శాతం పన్నుల వసూళ్లకు అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు.
ప్రజల నుంచి స్పందన
ఆస్తి పన్నుల వసూళ్లలో ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. గతానికి భిన్నంగా పన్నులు చెల్లించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. నాగర్కర్నూల్ జిల్లాలోని 461 గ్రామాల్లో రూ.7 కోట్లు చెల్లించాల్సి ఉండగా రూ.5.50 కోట్ల పన్నులు వసూలు చేశారు. పన్ను వసూళ్లకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తాం.
– కృష్ణ, డీపీవో, నాగర్కర్నూల్