నారాయణపేట, ఆగస్టు 15 : నిరంతర ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నదని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా నారాయణపేట పట్టణంలోని పరేడ్ మైదానంలో ని ర్వహించిన వేడుకలకు జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్, పేట, కొడంగల్ ఎమ్మెల్యేలు రాజేందర్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డితో కలిసి హాజరై పోలీసుల గౌరవ వంద నం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం హరిత, స్వర్ణ, జలసిరుల వైపు అడుగులు వేస్తున్నదన్నారు. ప్రజల సంక్షేమానికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రం ఏర్పడిన అనతికాలంలోనే అద్భుత విజయాలు సాధించిందన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలకు విదేశాల నుంచి ప్రశంశలు వస్తున్నాయన్నారు. గత జూన్లో జిల్లాలోని 79,24 5 మందికి ఆసరా పింఛన్లకు రూ.18.51కోట్లు ఇచ్చామన్నారు. 336 గ్రామాలకు గానూ 334 క్రీడా ప్రాంగణాలు నిర్మించామని, 2 పురోగతిలో ఉన్నాయన్నారు. 55 బృహత్ పల్లె ప్రకృతి వనాలకు స్థల సేకరణ చేపట్టి 48 పూర్తి చేశామన్నారు.
రైతుబంధు కింద నేటి వరకు రూ.2,188.93కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. అకాల వర్షాలకు 315 ఎకరాల్లో పంట నష్టం జరుగగా 281 మంది రైతులకు రూ.31,56,250 నష్టపరిహారం చెల్లించామన్నారు. పట్టణంలో రూ.50కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. 2023-24 ఏడాదిలో కల్యాణలక్ష్మి పథకం కింద 1,390మందికి రూ.13.92 కోట్లు, షాదీ ముబారక్ కింద 187మందికి రూ.1.87కోట్లు అందించామన్నారు. ఈ విద్యా సంవత్సరం జిల్లాలోని 73,899మంది విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు ఉచితంగా పంపిణీ చేశామన్నారు. మన ఊరు-మనబడిలో భాగంగా మొదటి విడుతలో 174 పాఠశాలల్లో రూ.74కోట్లతో పనులు చేపడుతున్నామన్నారు. ఆరోగ్యలక్ష్మి పథకంలో భాగంగా అంగన్వాడీల్లో 5,383 మంది గర్భిణులు, 4,551మంది బాలింతలకు ఒకపూట భోజనం ఇస్తున్నామన్నారు. పీఏసీసీలకు 5 గోడౌన్ల నిర్మాణానికి 6 ఎకరాల 5 గుంటల భూమిని కేటాయించామని చెప్పారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.