తిమ్మాజిపేట, ఏప్రిల్ 28 : ‘నీతో కలిసి చదువుకున్నాను.. నేను అమెరికాలో ఉన్నాను.. డాలర్లను రూపాయిలుగా మార్చేందుకు ఇబ్బంది అవుతున్నది. ఇండియన్ కరెన్సీ కావాలి’ అని మాటలు కలిపి రూ.2.85 లక్షలు దోచుకున్నారు. ఇందుకు సంబంధించి ఎస్సై శంషోద్దీన్ కథనం మేరకు.. నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలంలోని గుమ్మకొండ గ్రామానికి చెందిన ఆనంద్ హైదరాబాద్లో ఉండగా.. ఈ నెల 10వ తేదీన ఫోన్ కాల్ వచ్చింది. ‘నా పేరు గ్రీక్ జార్జ్. నీతో కలిసి చదివాను. ప్రస్తుతం అమెరికాలో వైద్యుడిగా పనిచేస్తున్నాను. నా వద్ద 2.85 లక్షల యూఎస్ డాలర్లు ఉన్నాయి. త్వరలో ఇండియాకు వస్తున్నాను. డాలర్లను రూపాయలుగా మార్చుకోవడం ఇక్కడ సమస్యగా ఉన్నది. ఇండియాకు వచ్చాక డాలర్లను మార్చుకుంటాను. నాకు రూ.2.85 లక్షలు డబ్బులు కావాలి.’ అని అవతలి వ్యక్తి ఆనందర్కు పలుసార్లు ఫోన్ చేశాడు. నమ్మకం కలగడంతో ఆనంద్ ఈ నెల 17, 18వ తేదీల్లో ఫోన్పే ద్వారా రూ.2.85 లక్షలు పంపించాడు.
ఆ తరువాత మళ్లీ ఫోన్ చేసి టెర్రరిస్ట్ క్లియరెన్స్ సర్టిఫికెట్ కోసం మరో రూ.3.85 లక్షలు కావాలని అడగడంతో ఆనంద్కు అనుమానం వచ్చింది. దీంతో అప్రమత్తమై 1930 నెంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. సైబర్ క్రైం అధికారులు వెంటనే స్పందించి ఆనంద్ ఖాతాను స్తంభింపజేయడంతో రూ.50 వేలు హోల్డ్లో ఉంచారు. బాధితుడు తిమ్మాజిపేట మండలానికి చెందిన వ్యక్తి కావడంతో సైబర్ క్రైం అధికారులు ఫిర్యాదును ఇక్కడికి పంపినట్లు ఎస్సై తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కేసు నమోదు చేశామన్నారు. కాగా, ఆనంద్ ఊర్కొండ పీఎస్లో పనిచేస్తున్నట్లు సమాచారం.