వనపర్తి, ఏప్రిల్ 29 : ఎండాకాలంలో ఉండే సమయాన్ని ప్రణాళికాబద్ధంగా వినియోగించుకుంటే మనలో దాగిఉన్న నైపుణ్యాలు బయటకు తీసుకురావచ్చు. చిన్నారుల్లోని ప్రతిభను మెరుగుపర్చుకునే అవకాశం కల్పిస్తూ వనపర్తి జిల్లా కేంద్రంలోని బాలభవన్లో వేసవి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ‘రారంరడోయ్ బాలలారా.. రారండోయ్ బాలభవన్కు’ అన్న పిలుపును అందుకున్న చిన్నారులు తమ కళలకు సాన పెట్టుకునేందుకు భారీగా తరలివస్తున్నారు. ప్రసుత్తం బాలభవన్లో విద్యార్థులు వివిధ కళల్లో శిక్షణ తీసుకుంటున్నారు. ఒక వైపు వేసవి సెలవులను సరదాగా గడుపుతూనే.. మరోవైపు వ్యక్తిగత సామర్థ్యాలకు పదును పెట్టేందుకు విద్యార్థు లు, తల్లిదండ్రులు ఆసక్తి కనబరుస్తున్నారు. చిత్రలేఖనం, నాట్యం, టైలరింగ్, కుట్లు, అల్లికలు వంటి పలు అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. 5-16 ఏండ్లలోపు చిన్నారులు, విద్యార్థులకు ఏప్రిల్ 28వ తేదీ నుంచి జూన్ 10 తేదీ వరకు 45 రోజులపాటు శిక్షణ కొనసాగనున్నది. ఉత్సాహభరిత వాతావరణం లో వేసవి శిబిరాన్ని నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శిక్షణ ఇస్తున్నారు. బాలభవన్లో ఎండాకాలంతోపాటు ఏడాది మొత్తం ఉచితంగా ట్రైనింగ్ ఇస్తున్నారు. రోజూ నిర్వహించే కార్యక్రమంతోపాటు వేసవి శిక్షణ శిబిరంతో కలుపుకొని దాదాపు 290 మందికి పైగా విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు.
సేవలను అందిపుచ్చుకోవాలి..
బాలభవన్ కేంద్రంలో వేసవి శిక్షణా శిబిరంతోపాటు ఏడాది మొత్తం అందిస్తున్న సేవలను చిన్నారులు అందిపుచ్చుకోవాలి. లలితకళలు ఎక్కడా నేర్పించరు. రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వం విద్యార్థుల్లో దాగి ఉన్న కళలను వెలిసితీసేందుకు ఏర్పాటు చేసిన బాలభవన్ను వినియోగించుకోవాలి. లలితకళలకు సంబంధించి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నాం.
– లావణ్య, బాలభవన్ కేంద్రం సూపరింటెండెంట్, వనపర్తి