కొల్లాపూర్ : మత్స్యకారుల సంక్షేమానికి ( Fishermen) రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ( Minister Jupally Krishnarao ) అన్నారు. బుధవారం జిల్లాలోని కేంద్ర మత్స్యశాఖ సంయుక్త కార్యదర్శి నీతూ కుమారి ప్రసాద్, తెలంగాణ మత్స్య శాఖ కమిషనర్ నిఖిల, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తో కలిసి సోమశిల ( Somaseela ) వద్ద శ్రీశైలం బ్యాక్ వాటర్ కృష్ణ నదిలో లక్ష చేప పిల్లలను వదిలారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని వంద శాతం సబ్సిడీతో అమలు చేస్తోందని వెల్లడించారు. మత్స్యకారులకు అనేక పథకాలు ప్రవేశపెట్టి వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపరచడం, ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా చేప పిల్లల పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో 2.50 కోట్ల చేప పిల్లల పంపిణీకి ఏర్పాట్లు చేశామని అన్నారు. మత్స్యకారులు అలవి వలలను ఉపయోగించరాదని మంత్రి హెచ్చరించారు. నాణ్యమైన చేప పిల్లలనే మత్స్యశాఖ అధికారులు పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు.
శ్రీశైలం క్రూయిజ్ లాంచీ సందర్శించిన మంత్రి
శ్రీశైలం వెళ్లే భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించాలని అధికారులను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. సోమశిల గ్రామంలో పర్యటించిన మంత్రి సోమశిల – శ్రీశైలం క్రూయిజ్ లాంచీని సందర్శించారు. శ్రీశైలం వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని, రెగ్యులర్గా శ్రీశైలంకు లాంచి నడిపేలా చర్యలు తీసుకోవాలని నాగర్ కర్నూలు జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహకు ఆదేశించారు.