పెబ్బేరు, మార్చి 24 : శ్రీరంగాపురం రంగనాథస్వామి రథోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు.. భక్తజన కోటికి ఆరాధ్యుడైన రంగనాథుడు తిరువీధుల్లో ఊరేగాడు. కనుల పండువగా సాగిన ఈ రథోత్సవాన్ని వేలాది మంది భక్తులు తిలకించి తన్మయత్వం పొందా రు. శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో ఏటా జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన రథోత్సవాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచే గాక, పొరుగు జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఏ ఆలయంలోనైనా రథోత్సవాలు రాత్రి పూట జరుగుతుండగా.. ఇక్కడ విశేషంగా పగటి పూటే నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యం లో ఉదయం 11 గంటలకు మొదలైన కార్యక్రమం మధ్యాహ్నం 2 గంటలకు ముగిసింది. రథోత్సవంతోపాటు 15 రోజుల పాటు జరిగే జాతర ప్రారంభమైంది.
శ్రీదేవి, భూదేవీ సమేతుడైన రంగనాథస్వామిని వేదమంత్రోచ్ఛారణల మధ్య రథంపై ఊరేగించే ఘట్టాన్ని వైభవంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని ఆలయ ధర్మకర్త కృష్ణదేవరావు ప్రారంభించగా ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్రెడ్డి హా జరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రథోత్సవానికి హాజరైన భక్తులకు శ్రీరంగాపురం గ్రామ సేవా సమితి వారు అన్నప్రసాద వితరణ నిర్వహించా రు. సుమారు ఐదు వేల మందికి వారు భోజన వసతి కల్పించారు. అలాగే, సేవాభారతి, నారాయణదాసు కుటుంబీకులు మజ్జిగ, వాలీబాల్ అసోసియేషన్ వారు తాగునీటి సౌకర్యం కల్పించారు. జాతర సందర్భంగా పలు రకాల దుకాణాలు వెలిశాయి. భక్తులు పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. ఆదివారం సెలవు కావడంతో ఉత్సవానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.