గద్వాల టౌన్, డిసెంబర్ 15 : శ్రావణమాసం, మాఘమాసం, కార్తీకమాసంతో పాటు హైందవ సంస్కృతిలో ధనుర్మాసానికి కూడ పెద్దపీట వేశారు. ఈ మాసమంతా కూడా మహావిష్ణువును భక్తితో కొలుస్తారు. ఈనెల మొత్తం ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మి కరుణా కటాక్షాలు కలుగుతాయన్నది భక్తుల నమ్మకం. ఎన్నో విశిష్టతలు, ప్రత్యేకతలు ఉన్న ధనుర్మాసం సంక్రాంతి పండుగకు ముందు ప్రారంభమవుతుంది. ఆదివారం నుంచి జనవరి 16వ తేదీ వరకు ధనురాస్మం ఉంటుంది.
ధనుర్మాసంలో ధనురాశిలోకి సూర్యుడు ప్రవేశించిన సమయం ధనుసంక్రమణం. ధనుస్సులో సుర్యుడుండే కాలం ధనుర్మాసం. గోదాదేవి కథ ఈ మాసానికి సంబంధించినదే కావడం వల్ల తిరుప్పావై పఠనం, గోదాదేవి కల్యాణం, ఆండాళమ్మ పూజలు ఈ మాసంలోనే నిర్వహిస్తారు. తిరుమలలో సుప్రభాతానికి బదులు తిరుప్పావై పాడతారంటే ఈ మాసానికి ఉన్న పవిత్రత ఎంతటిదో తెలుస్తున్నది. ఆలయాల్లో జరిగే ఆగమశాస్త్ర కైంకర్యాల్లో స్థానిక ఆ చార వ్యవహారాలు, సంప్రదాయాలు కలిసిన అం శాల్లో ధనుర్మాసం ఒకటి. ఈ మాసంలో ఉదయం, సాయంత్రం దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతోపాటు దరిద్రం దూరమవుతాయని పురాణాలు చెబుతున్నాయి.
మార్గశిరం అంటే మార్గాల్లో శ్రేష్ఠమైనదని, మార్గంలో సాధనం అనగా ఉపాయాల్లో గొప్పది అని అర్థం. మార్గం అనగా కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం అని కూడా అంటారు. కార్తికేయుడు, కాలభైరవుడు, దత్తాత్రేయుడితోపాటు భగవద్గీత అవతరించింది కూడా ఈ మాసంలోనే కావడం విశేషం. మార్గశిర మాసం శ్రీకృష్ణ తత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ మాసం లక్ష్మీదేవిని, నారాయణుడిని తులసి దళాలతో పూజిస్తే సకల సంపదలు కలుగుతాయని శాస్ర్తాలు చెబుతున్నాయి. అంతేకాక ఆధ్యాత్మిక భక్తి సంపదను పెట్టే ఉత్తమమైన కాలంగా ఈ మాసానికి ప్రత్యేకత ఉన్నది.
ఈనెల 16వ తేదీ నుంచి ధనుర్మాసం ప్రారంభం కానుండడంతో వైష్ణవ ఆలయాలు ముస్తాబవుతున్నాయి. నెల రోజులపాటు శ్రీమహావిష్ణువుకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శ్రీమహావిష్ణువు అవతారలైన శ్రీనరసింహస్వామి, రంగనాథస్వామి తదితర ఆలయాల్లో ధనుర్మాస పూజలు నిర్వహిస్తారు. జిల్లా కేంద్రం గద్వాల కోటలోని భూలక్ష్మీ చెన్నకేశవ అలయం, బుర్ధాపేటలోని రంగనాథస్వామి ఆలయం, గంజిపేటలోని వేంకటేశ్వరస్వామి ఆలయం, పెద్ద అగ్రహారంలోని లక్ష్మీ నరసింహస్వామి, భీంనగర్లోని శ్రీసంతాన వేణుగోపాలస్వామి, నది అగ్రహారంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయాలతోపాటు జిల్లాలోని అన్ని వైష్ణవ ఆలయాన్నింటిలో నెల రోజులపాటు స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.