కొల్లాపూర్, మార్చి 8 : భక్తుల శివనామస్మరణతో సోమశిల క్షేత్రం పులకించిపోయింది. శివ శివ శంకరా.. భక్తవశంకరా.. శంభో హరహర నమోన మో.. అంటూ లలితా సోమేశ్వరస్వామి ఆలయం లో మార్మోగింది. సోమేశ్వరాలయంలో రుద్రాభిషేకాలు, కుంకుమార్చనలు, అలంకరణ, లలితాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. కొల్లాపూర్ నుంచి ప్రత్యేక బస్సులను నడిపించారు. మహిళలు పెద్దఎత్తున సోమశిలకు తరలిరాగా.. ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. సప్తనదిలో(కృష్ణ, వేణి, తుంగ, భద్ర, మలపహారిణి, భీమారతి, భవనాసి) కొందరు పు ణ్యస్నానాలు ఆచరించారు. కొందరు మహిళలు మట్టితో గంగాదేవి ప్రతిమలను తయారుచేసి పూ జించారు. ఆలయ పరిసరాల్లో పలువురు భక్తులు పూనకాలతో ఊగిపోయారు.
ఏడాదిన్నర కాలంగా కృష్ణానదిలో మరబోట్లలో ఏపీ, తెలంగాణ ప్రాంతాలకు రాకపోకలు నిషేధించగా.. వైఎస్సార్సీపీ నేత బైరెడ్డి సిద్దార్థరెడ్డి జోక్యం చేసుకోవడంతో సోమశిల, సిద్దేశ్వరం మధ్య మరబోట్లు నడిపే వారి మధ్య వివాదానికి రాజీకుదుర్చినట్లు బోట్ల నిర్వాహకులు తెలిపారు. దీంతో సంగమేశ్వర ఆలయానికి మన భక్తులు బోట్లల్లో వెళ్లారు. ఒక్కొక్కరికీ రానుపోను కలిపి రూ.200 వసూలు చేశారు. ఆలయ ప్రాంగణలో తినుబండారాల దుకాణాలు వెలిశాయి. కొ ల్లాపూర్ ఆర్యవైశ్య సంఘం, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు.