కోటి లింగాలు కొలువై దక్షిణ కాశిగా పేరుగాంచిన అలంపురం క్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. నేటి నుంచి 24 వ తేదీ వరకు ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు రోజుకో అవతారంలో దర్శనమివ్వనున్నారు. 20వ తేదీ ఉదయం 10 గంటలకు జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి కల్యాణం, 22న రథోత్సవం, 23న కాళరాత్రి పూజ ఉండనున్నాయి. 24న తెప్పోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నది.
అలంపూర్, అక్టోబర్14 : కోటి లింగాలు కొలువై దక్షిణ కాశిగా పేరుగాంచిన అలంపురం క్షేత్రం రాష్ట్రంలోనే ఏకైక శక్తిపీఠంగా విరాజిల్లుతున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో (శ్రీశైలం, పిఠాపురం, ద్రాక్షారామం, అలంపురం) నాలుగు శక్తిపీఠాలుండగా విభజన అనంతరం అలంపురం జోగుళాంబ ఏకైక శక్తిపీఠంగా తెలంగాణలో ప్రసిద్ధికెక్కింది. రాజధానికి సుమారు 200 కిలోమీటర్ల దూరంలో, గద్వాల జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్లు, కర్నూల్కు 30 కిలోమీటర్ల దూరంలో, తుంగభద్రా నది తీరంలో అలంపూర్ పుణ్యక్షేత్రం వెలిసింది. క్షేత్రాన్ని దర్శించుకునేందుకు రోడ్డు మార్గంతోపాటు రైలుమార్గం కూడా ఉంది.
ఈ క్షేత్రంలో జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలతోపాటు నవబ్రహ్మ ఆలయాలు దర్శనమిస్తాయి. కోటి లింగాలు కొలువైన క్షేత్రంలో లేని దేవతామూర్తంటూ లేడు. రేణుకాదేవి భక్తులకు సంతానలక్ష్మిగా దర్శనమిస్తుంది. ఇక్కడ కంచి కామాక్షి ఆలయం కూడా ఉన్నది. శతాబ్దాల చరిత్ర గల మ్యూజియంలోని శిల్ప సంపదను తిలకించడానికి విదేశాల నుంచి సైతం యాత్రికులు వస్తుంటారు. దక్షిణ కాశిగా, భాస్కర క్షేత్రంగా, పరశురామ క్షేత్రంగా అలంపురం విరాజిల్లుతున్నది. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో కృష్ణ, తుంగభద్రా నదుల సంగమం వద్ద ముంపునకు గురైన సంగమేశ్వర ఆలయాన్ని యథావిధంగా అవే రాళ్లతో (మలచిన ఎర్రరాయి శిల్పాలు) అదే ఆకారం, అదే నమూనాతో ఆలయాన్ని పునః నిర్మించడం చరిత్రలో ఎక్కడా లేదు.
రసాత్మక లింగం – గోస్పాద ముద్రికం
ప్రపంచంలో ఏ క్షేత్రంలో లేనివిధంగా ఇక్కడ ప్రత్యేక ఆకారంలో రసలింగం ఉన్నది. పూర్వం ఈ లింగం నుంచి కొన్ని ప్రత్యేకమైన రసాలు వెలువడుతుండేవి కాబట్టి దానికి రసలింగం అని, బ్రహ్మ తపస్సు చేస్తే పరమేశ్వరుడు ఉద్భవించాడు కాబట్టి బ్రహ్మేశ్వరుడని, ఆకారం చిన్నగా ఉన్నందునా బాలబ్రహ్మేశ్వరుడని పలు పేర్లు వాడుకలో ఉన్నాయి. గోమాత నేలపై పాదం మోపినపుడు ఎలాంటి నమూన ఏర్పడుతుందో ఆ విధంగా (ఆవు గెట్టె పైభాగం ఆకారంలో)పై భాగం చీలిపోయినట్లు ఉంటుంది. శివలింగం నుంచి వెలువడుతున్న విషయాన్ని గమనించిన కొందరు రససిద్దులు పరుశువేది అనే మూలిక సహాయంతో బంగారాన్ని చేసే వారని, అదే బంగారంతో ప్రధా న ఆలయాల చుట్టూ మరో ఎనిమిది ఆలయాలను నిర్మించినట్టు చరిత్ర చెబుతున్నది. అవే నేడు నవబ్రహ్మ ఆలయాలుగా పిలువబడుతున్నాయి.
నవ బ్రహ్మాలయాలు
శైవక్షేత్రాలకు తలమానికంగా శ్రీశైలం క్షేత్రానికి పశ్చిమ ద్వారంలో అలంపూర్, ఉత్తర ద్వారంలో ఉమామహేశ్వరం, తూర్పున త్రిపురాంతకం, పడమరన సిద్ధవటం క్షేత్రాలు వెలిశాయి. సుమారు 1400 సంవత్సరాల కిందట బాదామి చాళుక్యుల కాలంలో రెండో అలంపూరంలో ఆలయాలను నిర్మించినట్టు శిలాశాసనాల ద్వారా తెలుస్తున్నది. క్షేత్రంలో ప్రధాన ఆలయమైన బాలబ్రహ్మతోపాటు కుమారబ్రహ్మ, ఆర్క బ్రహ్మ, వీర బ్రహ్మ, తారక బ్రహ్మ, విశ్వ బ్రహ్మ, గరుడ బ్రహ్మ, పద్మ బ్రహ్మ, స్వర్గ బ్రహ్మ వంటి నవ బ్రహ్మాలయాలు కూడా నిర్మితమయ్యాయి. ఈ ఆలయాల మీద అలనాటి సంసృతీ సంప్రదాయాలకు అద్దం పట్టేవిధంగా నాటి అష్టదిక్పాలకులు, శివ, విష్ణు అవతారాలు, నటరాజు, పురాణ గాథలు తెలిపే శిల్ప సంపద, మరెన్నో శిల్పాలు ముగ్ధమనోహరంగా మలచబడ్డాయి. పంచతంత్ర, కావ్య కథా చిత్రాలు, ఆదిత్య హృదయం, రామాయణ, మహాభారత గాథలు తెలియజేసే ఎన్నో శిల్పాలు యాత్రికులకు కనువిందు చేస్తున్నాయి. మరికొన్ని శిల్పాలు మ్యూజియంలో భద్రపర్చారు.
పాపనాశిని ఆలయాలు..
జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలకు దక్షిణ దిశలో కొంతదూరంలో 24 ఆలయాల సముదాయం (పాపనాశిని ఆలయాలు) ఉన్నది. ఈ ఆలయాలు ద్రావిడ సాంప్రదాయానికి చెందినవిగా గుర్తించారు. ఆలయ స్తంభాలపై రామాయణ, మహాభారత, క్షీరసాగర మథనం గాథలు తెలియజేసే అపురూప శిల్పకళా చిత్రాలు ఇక్కడ దర్శనమిస్తాయి. 24 ఆలయాల్లోనూ భిన్నమైన శివలింగాలు, ప్రధాన ఆలయంలో ఆకుపచ్చ రంగులో శివలింగం దర్శనమిస్తుంది.
ఉత్సవాలు ఇలా..
శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఆలయ ఈవో పురేందర్కుమార్, ఆలయ పాలక మండలి సభ్యులు, కమిటీ చైర్మన్ చిన్న కృష్ణయ్యనాయుడు, ఆలయ సిబ్బంది, అర్చకులు, దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు చర్యలు చేపట్టారు. ఆదివారం నుంచి 24వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. నవరాత్రుల్లో అమ్మవారు రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు.
ఉత్సవాలు ఇలా..
శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఆలయ ఈవో పురేందర్కుమార్, ఆలయ పాలక మండలి సభ్యులు, కమిటీ చైర్మన్ చిన్న కృష్ణయ్యనాయుడు చర్యలు చేపట్టారు. ఆదివారం నుంచి 24వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు.
రోజుకో అవతారంలో..
ఆదివారం యాగశాల ప్రవేశం, సాయంత్రం 6 గంటలకు ధ్వజారోహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. కాగా అమ్మవారు నవరాత్రుల్లో రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆదివారం శైలపుత్రీదేవిగా, 16న బ్రహ్మచారిణీదేవిగా, 17న చంద్ర ఘంటాదేవిగా, 18న తేది కూష్మాండాదేవిగా, 19న స్కందమాతాదేవిగా, 20న క్యాత్యాయనీదేవిగా, 21న కాళరాత్రిదేవిగా, 22న మహా గౌరీదేవిగా, 23న సిద్ధిదాత్రీదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. 20వ తేదీ ఉదయం 10గంటలకు జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వాముల కల్యాణం, సాయంత్రం మాతకు సింహవాహన సేవ, 22న (ఆదివారం) ఉదయం రథోత్సవం, 23న (మహర్ణవమి రోజు) కాళరాత్రి పూజ, 24న పూర్ణాహుతి, సాయంత్రం ధ్వజావరోహణ కార్యక్రమాలతో శరన్నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ ఈవో పురేందర్కుమార్, ఆలయ చైర్మన్ చిన్న కృష్ణయ్యనాయుడు తెలిపారు.
ప్రత్యేక ఆకర్షణగా తెప్పోత్సవం
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే తెప్పోత్సవం ప్రత్యేక అకర్షణగా నిలుస్తుంది. 24న (విజయదశిమి) ప్రత్యేక పూజల అనంతరం గంగ పూజలో భాగంగా నదిలో ఆదిదంపతుల జల విహారం (తెప్పోత్సవం) ఘనంగా నిర్వహిస్తారు. ఇందుకోసం దేవస్థానం వారు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.