గద్వాలటౌన్, డిసెంబర్ 13: అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడిగా.. కొలిచిన వారికి కొంగుబంగారంగా గద్వాలలోని భీంనగర్లో కొలువైన సంతాన వేణుగోపాలస్వామి భక్తులతో నిత్యపూజలు అందుకుంటున్నాడు. ఆ పక్కనే స్వయంభూగా వెలిసిన హయగ్రీవ స్వామివారు నిత్యం భక్తులతో అఖండ పూజలు అందుకుంటున్నాడు. దీంతో ఆలయం ఎంతో విశిష్టతను సంతరించుకున్నది. ప్రతి ఏడాది మార్గశిర మాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాలను సంస్థాన కాలం నుంచి వైభవంగా నిర్వహిస్తున్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలనే గద్వాల చిన్నజాతర అనికూడా పిలుస్తారు. నాటి ఆనవాయితీని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా మూడురోజులపాటు ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్నిఏర్పాట్లు పూర్తయ్యాయి. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగ కుండా నిర్వాహకులు అన్నిఏర్పాట్లు చేపట్టారు.
గద్వాల చిన్న జాతర
స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని పట్టణంలోని భీంనగర్లో జాతర ఏర్పాటవుతున్నది. ఈ జాతరను గద్వాల చిన్నజాతర, భీంనగర్ జాతర అని పిలుస్తారు. ఈ జాతర సందర్భంగా పెద్దఎత్తున్న అంగళ్లు, రంగురాట్నాలు, సర్కస్లు వెలుస్తాయి. ముఖ్యంగా జాతరకు ప్రత్యేకంగా మాంసం అంగళ్లు ఎక్కువగా వెలుస్తాయి. జాతర దాదాపు నెలరోజులపాటు సాగనున్నది.
బ్రహ్మోత్సవాలకు ఏర్పాటు పూర్తి
స్వామివారి బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 10గంటలకు పుణ్యహవచనం, అంకురారోహణంతో ప్రారంభంకానున్నాయి. 11గంటలకు ధ్వజారోహణం, భేరీపూజ, హోమాలు నిర్వహిస్తారు. సాయంత్రం 6గంటలకు స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. గురువారం ఉదయం 10గంటలకు నిత్యహోమం, రాత్రి 8గంటలకు రథోత్సవం, స్వామివారిసేవ, ఊరేగింపు ఉంటుంది. శుక్రవారం ఉదయం10 గంటలకు పారువేట, 3గంటలకు తీర్థావళి, నాగవల్లి, పూర్నాహుతి దేవతా విసర్జనలు ఉంటాయని ఆలయ ప్రధాన అర్చకులు బోరవెల్లి పవన్కుమర్, రాఘవచారి తెలిపారు.