కందనూలు, ఏప్రిల్ 26 : ఏసీబీ వలలో అవినీతి చేప చిక్కింది. గతంలో చేసిన పనులకు సంబంధించి బిల్లులు చేసేందుకు సర్వశిక్షా అభియాన్ మహబూబ్నగర్ రిటైర్డ్ సైట్ ఇంజినీర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబట్టాడు. ఏసీబీ అధికారుల కథనం మేరకు.. సర్వశిక్ష అభియాన్ మహబూబ్నగర్ సైట్ ఇంజినీర్గా పనిచేస్తూ రిటైర్డ్ అయిన కాటమోని మహేందర్గౌడ్ గతంలో కోడేరు పాఠశాలలో సైన్స్ ల్యాబ్రూం, ప్రహరీ నిర్మాణానికి ఫైనల్ బిల్లు చేయాల్సి ఉంది.
బిల్లు చేసేందుకుగానూ అప్పటి విద్యాకమిటీ చైర్మన్ ఎం.శేఖర్ను రూ.7వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో అతడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. నాగర్కర్నూల్లో బుధవారం లంచం తీసుకుంటుండగా, ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని నాంపల్లి కోర్టుకు తరలించారు. అంతకుముందు మహబూబ్నగర్లోని విద్యాశాఖ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు.