నాగర్ కర్నూల్ : పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన నార్లపూర్ రిజర్వాయర్ (Narlapur Reservior ) నిర్వాసితుల పునరావాస పనులను (Rehabilitation work) వేగవంతం చేయాలని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ( Minister Jupally Krishna Rao) అధికారులను ఆదేశించారు. సోమవారం బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో నీటిపారుదల, ఆర్ అండ్ ఆర్ అధికారులతో మంత్రి జూపల్లి సమీక్ష నిర్వహించారు.
ఎల్లూర్ శివారులోని టన్నెల్ సమీపంలోని ప్రస్తుత ప్రతిపాదిత పునరావాస ప్రాంతంలో కాకుండా ఎత్తైన ప్రాంతంలో ఇండ్ల స్థలాలను కేటాయించాలని బోడబండా తండా గ్రామపంచాయతీ పరిధిలోని సున్నపు తండా, దూల్యనాయక్ తండా, అంజనగిరి తండా , వడ్డె గుడిసెలు గ్రామాలకు చెందిన 117 మంది నిర్వాసితులు మంత్రికి విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా ప్రభుత్వ, అటవీ భూముల్లో ఉన్న ఎల్లూర్, నార్లాపూర్ గ్రామాల నిర్వాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించినప్పటికీ వారికి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎల్లూరు- నార్లాపూర్ రిజర్వాయర్ల మధ్యన ఉన్న బోడబండ తండాను రీ లోకేట్ చేయాలని నిర్వాసితులు కోరారు. నిర్వాసితుల విజ్ఞప్తులను పరిశీలించి, పునరావాస కల్పనకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
ఎల్లూరు నుంచి బోడబండ తండా, బోడబండ తండా నుంచి మూల చింతపల్లి రోడ్ వరకు అధ్వన్నంగా ఉన్న రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమీక్షలో నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ఆర్ఆండ్ఆర్ కమిషనర్ వినయ కృష్ణారెడ్డి, నీటిపారుదల స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, చీఫ్ ఇంజనీర్ విజయభాస్కర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు శ్రీనివాస్ రెడ్డి, రవీందర్,అధికారులు పాల్గొన్నారు.