సంస్మరణ సభలో వక్తలు, కవులు
పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో నిర్వహణ
చిక్కడపల్లి, మార్చి 27 : గొప్ప మానవతావాది రామ్మోహన్ అని పలువురు వక్తలు అన్నారు. పాలమూరు అధ్యయన వేదిక, బంధు మిత్రుల ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విప్లవ రచయిత, నవసమాజ స్వాప్నికుడు సి.రామ్మోహన్ సంస్మరణ సభ, రామ్మెహన్ రచనల పుస్తకం ‘మా నవతా పతాక మన రామ్మోహన్ @ 75’ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ చిరకాల మిత్రుడు రామ్మోహన్, ఆయన చాలా నిగ్రహంగా మాట్లాడే వ్యక్తి అని పేర్కొన్నారు. ఉపాధ్యాయ ఉద్యమ నిర్మాణంలో ఆయన అంతర్భాగం అన్నారు. విలువలకు మారుపేరుగా రామ్మోహన్ నిలిచారని వివరించారు. ఎమ్మెల్సీ గోరటి వెంకన్న మాట్లాడుతూ స్వప్నవారధి రామ్మోహన్ అని అన్నారు. మహబూబ్నగర్లో ప్రగతిశీల ప్రజాస్వామ్య వేదిక ఏదైనా ఉపన్యాసం కోసం తాము అక్కడ ఉండే వాళ్లమని గుర్తు చేశారు. సార్ ప్రసంగం ఎంతో ఉత్తేజ పరిచేదని వివరించారు. నిజమైన కమ్యూనిస్టు రామ్మోహన్ సార్ అని అన్నారు. పద్మశ్రీ అవార్డుగ్రహీత కె.శివారెడ్డి మాట్లాడుతూ తాను వ్యక్తికి పట్టం కడుతానని, మంచి వ్యక్తి రామ్మోహన్ అని అన్నారు. రామ్మోహన్తో తన స్నేహం నాలుగు దశాబ్దాలు దాటిందన్నారు. కవులు, కళాకారులు కుటుంబాలపై అశ్రద్ధ వహిస్తారని అందరూ అంటారు. కానీ రామ్మోహన్ ఈ విషయం సరికాదని, ఆయన కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చేవారని వివరించారు. సాహిత్య, సామాజిక, రాజకీయ విశ్లేషణలో సాటిలేని మేటి అన్నారు. ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. రచయిత్రి విమల మాట్లాడుతూ ప్రజాస్వామిక కుటుంబాన్ని రామ్మోహన్ పరిచయం చేశారు. పీడిత ప్రజల పక్షాన నిలబడ్డ వ్యక్తి, మార్పు కోసం రామ్మోహన్ కృషి చేశారని చెప్పారు. ఆయన పాలమూరు కార్మికుల గురించి మొట్టమొదటి సారి మాట్లాడారని వివరించారు. ఎ.రాజేంద్ర బాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రముఖ పాత్రికేయుడు కె.శ్రీనివాస్, సుధాకిరణ్, సాప్ మాజీ చైర్మర్ శ్రీధర్ రెడ్డి, తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాళేశ్వరం శంకరం, రామ్మోహన్ కుటుంబ సభ్యులు, మిత్రులు,కవులు, రచయితలు పాల్గొన్నారు.