అయిజ, ఫిబ్రవరి 28 : ఇటుకల బట్ట్టీతో గ్రామం కాలుష్య కోరల్లో చిక్కుకుంటుందని మండలంలోని ఉత్తనూర్ గ్రామంలోని ఇటుకల బట్టీ వద్ద శనివారం ఉప సర్పంచ్ రాంచంద్రారెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు నిరసన చేపట్టారు. నెల రోజులుగా ఇటుకల బట్టీని మూసివేయాలని కలెక్టర్, అదనపు కలెక్టర్, తాసీల్దార్, ఎంపీడీవోలకు వినతిపత్రాలు అందజేసినా స్పందించడంలేదని ఆరోపించారు. కాలుష్యం కారణంగా ఎంతోమంది అనారోగ్యాల పాలవుతున్న విషయం అధికారులకు మొర పెట్టుకున్నా అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు.
సర్పంచ్, ఉప సర్పంచ్గా తమ విధులను తాము నిర్వర్తించి, ఇటుకల బట్టీ యజమానులకు నోటీసులు జారీ చేసినా మూసివేయకపోవడంతో నిరసనకు దిగామని ఉపసర్పంచ్ రాంచంద్రారెడ్డి అన్నారు. ఇటుకల మూసివేసే వరకు నిరసన కొనసాగిస్తామని హెచ్చరించారు. ఎస్సై శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకొని నిరసన విరమించాలని నిరసనకారులను కోరారు. . అధికార పార్టీ నాయకుల ఒత్తిడితోనే ఇటుకల బట్టీ నిర్వాహకులకు అధికారులు, పోలీసులు వంతపాడుతున్నారని ఉప సర్పంచ్ ఆరోపించారు.
విషయం తెలుసుకున్న ఎంపీడీవో భాస్కర్ ఘటనా స్థలానికి చేరుకొని నిరసన కారులతో మాట్లాడారు. ఇటుక బట్టీకి ప్రభుత్వ అనుమతి లేదని, వెంటనే నోటీసులు జారీ చేస్తామన్నారు. నోటీసులకు సరైన సమాధానం ఇవ్వకపోతే బట్టీని మూసివేసేందుకు చర్యలు తీసుకుంటామని నిరసనకారులకు హామీ ఇచ్చారు. ఇటుకల బట్టీ మూసివేస్తే తాము ఉపాధి కోల్పోతామని అందులో పనిచేస్తున్న కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.