SSC Exam Preparation | ‘పది’లమైన ఫలితాల కోసం విద్యాశాఖ కసరత్తు చేస్తున్నది. ఏప్రిల్ నెలలో జరిగే ఎస్సెస్సీ పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా అధికారులు అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం ప్రణాళికలు రూపొందించి పక్కాగా అమలు చేస్తున్నారు. జీపీఏ-10 సాధనకు ప్రత్యేక తరగతులను సైతం నిర్వహిస్తున్నారు. నిత్యం ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులు కడుపు మాడ్చుకోకుండా ప్రభుత్వ పాఠశాలల్లో సర్కార్ అల్పాహారాన్ని సైతం అందజేస్తున్నది. బాగా
చదివి తల్లిదండ్రులు, బడులకు పేరు తీసుకొచ్చేలా ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. శ్రమ ఆయుధమైతే విజయం మీ సొంతమవుతుందని సూచిస్తున్నారు.
వనపర్తి, ఫిబ్రవరి 28: పదో తరగతి పరీక్షలు వస్తున్నాయంటేనే విద్యార్థుల్లో ఏదో భయాందోళన. విద్యార్థులు ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా ముందు నుంచే ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకోవడం వల్ల ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడంతోపాటు మంచి ఉత్తీర్ణత శాతాన్ని పెంచుకోవడానికి వీలుంటుంది. ఈ దిశగా కలెక్టర్ తేజస్ నందలాల్పవార్ పలుమార్లు విద్యాశాఖ అధికారులతో చర్చించి ఉత్తీర్ణత శాతం పెంచేలా ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించాలనే అంశాలపై సమీక్షా సమావేశాలు నిర్వహించారు. విద్యార్థుల్లో నెలకొన్న సమస్యలు, భయాందోళనలు పోగొట్టేలా పలు అవగాహన కార్యక్రమాలను సైతం నిర్వహిస్తూ విద్యార్థుల్లో ధైర్యాన్ని నింపుతున్నారు.
ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. హెచ్ఎం ఉపాధ్యాయులతోపాటు తల్లిదండ్రుల బాధ్యతను విద్యార్థులకు ఇంటి వద్ద చదివేందుకు వాతావరణం కల్పించాలని సూచించారు. పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహారం అందజేయడంతో విద్యార్థులు వందశాతం లక్ష్యం ఛేదించనున్నారు.
టీశాట్, డిజిటల్ మాధ్యమాల ద్వారా పరీక్షలపై అవగాహన కల్పిస్తూ సందేహాలను నివృత్తి చేస్తున్నారు. విద్యార్థులు సమయపాలన, ఏకాగ్రతతో చదివి పరీక్షలకు సిద్ధమయ్యేలా చేయడం, పరీక్షలంటే భయపడటం కాకుండా, బాగా చదివిన వాళ్లు, తప్పనిసరిగా బాగానే రాస్తారని, విద్యార్థులందరూ విజయం సాధించేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకుంటున్నారు.
పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేలా విద్యాశాఖ అధికారులు చేపట్టాల్సిన చర్యలపై కలెక్టర్ ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డీఈవో కాంప్లెక్స్ సమావేశాలు, పాఠశాలలను సందర్శిస్తూ పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులను ప్రోత్సహించడం, సత్ఫలితాలను పొందే ప్రణాళికలు అమలు చేస్తున్నారు. మాదిరి పరీక్షలు నిర్వహించడం ద్వారా విద్యార్థులు వార్షిక పరీక్షలకు హాజరవుతున్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 3నుంచి వార్షిక పరీక్షలు జరగనున్నాయి.
గతంలో పాఠ్యాంశాలను బోధించనప్పటికీ ప్రత్యేక తరగతులు నిర్వహించడం వల్ల పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలో ఉపాధ్యాయులు వివరించారు. దీంతో పరీక్షలకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాము. మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషిచేస్తాం.
– విజ్ఞేశ్, విద్యార్థి, బాలుర ఉన్నత పాఠశాల, కొత్తకోట
చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలని బోధిస్తున్నాం. అలాగే పరీక్ష పేపర్లు ఏ విధంగా వస్తాయో, ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులును చెబుతూ ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నాం. విద్యార్థులు అర్థం చేసుకొని ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలి.
– ప్రవీణ్కుమార్, హెచ్ఎం, బాలుర ఉన్నత పాఠశాల, కొత్తకోట
విద్యార్థులు శ్రద్ధగా చదవడంతోపాటు ప్రశ్నలకు సమాధానాలు రాసుకొని చూసుకోవాలి. విందులు, వినోదాలు, పెండ్లిళ్లకు దూరంగా ఉండాలి. పరీక్షా పత్రాలను అవగాహన చేసుకొని ప్రణాళికాబద్ధంగా చదవాలి. చదివిన విషయాలను రివిజన్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు సందేహాలను నివృత్తి చేసుకోవాలి.
– రవీందర్, డీఈవో, వనపర్తి
పదో తరగతి పరీక్షలో గతంలో మాదిరి కాకుండా సబ్జెక్టుకు 80మార్కులకు ఒకే పేపర్ నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికే నిర్వహించిన మాదిరి పరీక్షా పత్రాలను అధ్యయనం చేస్తూ ప్రణాళికబద్ధంగా విద్యార్థులు సిద్ధం కావాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. విద్యార్థులు మంచిగా పరీక్షలు రాసి వందశాతం ఫలితాలు సాధించాలి. శ్రమ నీ ఆయుధం.. అయితే విజయం మీ బానిస అవుతుంది.
– తేజస్ నందలాల్ పవార్, కలెక్టర్, వనపర్తి జిల్లా