ఆరోగ్యానికి తల్లిలా మేలు చేసే ఉల్లికి మార్కెట్లో ఎప్పుడూ గిరాకీ ఉంటుంది. వేసవి పంటగా సాగు చేసేందుకు ఇదే అనువైన సమయమని, సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చని పాలెం శాస్త్రవేత్త ఆదిశంకర్, కేవీకే కో ఆర్డినేటర్ ప్రభాకర్రెడ్డి తెలిపారు. ఉల్లిలో రకాలు, సాగు విధానం, దిగుబడులపై రైతులకు సలహాలు, సూచనలు అందజేశారు. వివరాల కోసం రైతులు 9912604549, 7702366110 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
– బిజినేపల్లి, జనవరి 11
బళ్లారి రెడ్, రాంపూర్ రెడ్, వైట్ ఆనియన్, పూసా రెడ్, అర్కనికేతన్, అర్కకళ్యాణ్, అర్క ప్రగతి, కళ్యాణ్పూర్, రెడ్ రౌండ్, ఎన్-53, అగ్రిపౌండ్ లైట్ రెడ్, అగ్రిపౌండ్ డార్క్ రెడ్, తెలుపు రకాల్లో పూసా వైట్ రౌండ్, పూసా వైట్ ప్లాట్, భీమా సూపర్, భీమా డార్క్ రెడ్, భీమా రెడ్, భీమా శ్వేత, భీమా శుభ్ర.
బళ్లారి రెడ్ : పాయలు పెద్దగా ఉంటాయి. ఘాటు తక్కువగా ఉంటుంది. మన రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో సాగుకు అనుకూలం.
రాంపూర్ రెడ్ : బళ్లారి రెడ్లా ఉండే ఈ రకం ఉత్తర భారతదేశంలో ప్రసిద్ధి చెందింది. పాయలు పెద్దగా ఉండి ఘాటు ఎక్కువగా ఉంటుంది. దిగుబడి తక్కువ. పాయలు తెల్లగా ఉంటాయి.
నాసిక్ రెడ్ : పాయలు మధ్యస్థంగా ఉండి ఎరుపు రంగులో ఉంటాయి. ఘాటుగా ఉంటాయి.
అగ్రిపౌండ్ డార్క్ రెడ్ : పాయలు ముదురు ఎరుపు రంగులో గుండ్రంగా ఉంటాయి. ఘాటు ఉంటుంది. ఈ రకం ఉల్లిగడ్డను ఎక్కువ రోజులు నిల్వ చేయవచ్చు. పాయలు ఎరుపు రంగులో మధ్యస్థంగా (70-90 గ్రాములు) ఉంటాయి. దిగుబడి ఎకరాకు 100 నుంచి 120 క్వింటాళ్ల వరకు వస్తుంది.
అర్కనికేతన్ : పాయలు ఎరుపు రంగుతో 100-180 గ్రాముల బరువు ఉంటాయి. తేమ శాతం (టీఎస్ఎస్) 12-14 శాతం. నిల్వ నాణ్యత, ఘాటు ఎక్కువ. దిగుబడి ఎకరానికి 132 క్వింటాళ్లు వస్తుంది. ఈ రకం వానకాలం, యాసంగి సాగుకు అనువైనది.
అర్క కళ్యాణ్ : పాయల బరువు 100-190 గ్రాములు. దిగుబడి ఎకరానికి 136 క్వింటాళ్ల వరకు వస్తుంది. ఆకుమచ్చ తెగులును కొద్దిగా తట్టుకుంటుంది.
అర్క ప్రగతి : 120 రోజుల్లో కోతకు వచ్చే గుండ్రని ఎరుపు రకం. వానకాలం, యాసంగి రెండు పంటలకు అనువైనది. ఎకరానికి దిగుబడి 130 క్వింటాళ్ల వరకు వస్తుంది.
కళ్యాణ్పూర్ రెడ్ రౌండ్ : ఎరుపు రకం. టీఎస్ఎస్ 13-14 శాతం. 130 నుంచి 150 రోజుల్లో కోతకు వస్తుంది. ఎకరానికి వంద నుంచి 120 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది.
ఎన్-53 : పాయలు మధ్యస్థ గుండ్రంగా, ముదురు ఎరుపు రంగులో ఉంటాయి. దిగుబడి ఎకరానికి 100-120 క్వింటాళ్లు. పంట కాలం 140 రోజులు. ఇది వానకాలం పంటకు అనువైనది.
అగ్రిపౌండ్ లైట్ రెడ్ : పాయలు చిన్నవిగా, గట్టిగా గులాబీ రంగులో ఘాటుగా ఉంటాయి. నారు పోయకుండా విత్తనం నేరుగా విత్తుకోవచ్చు. ఎక్కువ రోజులు నిల్వ ఉండి రవాణాకు తట్టుకుంటాయి. ఎగుమతులకు అనువుగా ఉంటుంది. ఇవిగాక తెలుపు రకాలైన పూసా వైట్ రౌండ్, పూసా వైట్ప్లాట్ డీ హైడ్రేషన్కు అనువైనవి.
భీమా సూపర్ : అక్టోబర్, నవంబర్లో సాగుకు అనుకూలం. పంట కాలం 110 నుంచి 120 రోజుల వ్యవధి. దిగుబడి హెక్టారుకు 40 నుంచి 45 టన్నులు వస్తుంది.
భీమా డార్క్ రెడ్ : వానకాలం పంటకు అనుకూలం. పంట కాలం 95 – 100 రోజులు. హెక్టారుకు 20 – 25 టన్నుల దిగుబడి వస్తుంది.
భీమా రెడ్ : వానకాలం, యాసంగి సాగుకు అనుకూలం. వానకాలం పంట కాలం 105 – 110 రోజులు, యాసంగిలో అయితే 110 – 120 రోజులు. వానకాలంలో 45 టన్నులు, యాసంగిలో 38 టన్నులు హెక్టారుకు దిగుబడి వస్తుంది.
భీమా శ్వేత : తెలుపు రకం. యాసంగి పంటకు అనుకూలం. 110- 120 రోజులు పంట వ్యవధి. హెక్టారుకు 30 టన్నుల దిగుబడి వస్తుంది.
భీమా శుభ్ర : వానకాలం, యాసంగి రెండు పంటలకు అనుకూలం. వానకాలం 20, యాసంగిలో 30 టన్నులు హెక్టారుకు దిగుబడి వస్తుంది.
తామర పురుగులు : ఇవి ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చడం వల్ల తెల్లటి మచ్చలేర్పడుతాయి. దాంతోపాటు ఆకులు, కాడలపై ఉదా రంగు మచ్చలు వస్తాయి. వీటి నివారణకు లీటర్ నీటికి డై మిథోయేట్ లేదా పిప్రోనిల్ 2 మి.లీ., మాంకోజెబ్ 3 గ్రాముల చొప్పున కలిపి 10 రోజుల వ్యవధిలో మూడు సార్లు పిచికారీ చేయాలి.
పచ్చపురుగు : ఉల్లిలో ఆకు తినే పచ్చ పురుగు నివారణకు లీటర్ నీటికి కార్బరిల్ 3 గ్రాములు లేదా ప్రొపినోఫాస్ 2 మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
ఆకుమచ్చ తెగులు : ఆకులపై ఉదా రంగు మచ్చలు ఏర్పడి ఆకులు ఎండిపోతాయి. వాతావరణంలో తేమ ఎక్కువైనప్పుడు తెగులు ఉధృతి ఎక్కువవుతుంది. దీని నివారణకు లీటర్ నీటికి మాంకోజెబ్ 3 గ్రాములు లేదా క్లోరోథలోనిల్ 2.5 గ్రాములు లేదా కార్బండిజమ్, మాంకోజెబ్ కలిపిన మందు 2 గ్రాముల చొప్పున కలిపి స్ప్రే చేయాలి.
బోట్రైటిస్ : నులి పురుగుల వల్ల ఇది సోకుతుంది. దీని నివారణకు లీటర్ నీటికి పెసిలియోమైసిస్ 10 ఎం.ఎల్ చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
కుళ్లు తెగులు : దీని నివారణకు మెటలాక్సిల్ + మాంకోజెబ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
పర్పుల్ బ్లాచ్ : దీని నివారణకు అజాక్సిస్ట్రోబిన్ 1 మి.లీ. లేదా టెబుకోనజోల్ 1.5 ఎం.ఎల్. మందును లీటర్ నీటికి కలిపి స్ప్రే చేయాలి.
వానకాలం పంటగా జూన్, జూలై నుంచి అక్టోబర్, నవంబర్ వరకు.. యాసంగి పంటగా నవంబర్, డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు సాగు చేసుకోవచ్చు. వేసవి పంటగా జనవరి, ఫిబ్రవరి నెలల్లో నారు నాటవచ్చు. వాతావరణంలో పెద్దగా మార్పుల్లేని ప్రాంతాల్లో ఉల్లి ఎదుగుదల బాగుంటుంది.
నేలలు ఉల్లి సాగుకు నీరు నిల్వని సారవంతమైన మెరక నేలలు అనుకూలం. ఉప్పు, చౌడు, క్షారత్వం, నీరు నిల్వ ఉండే నేలలు పనికిరావు.
రెండు, మూడు సార్లు దుక్కి దున్ని పొలాన్ని చదును చేయాలి. 30 సెంటీమీటర్ల ఎడంలో బోదెలు చేసి రెండు వైపులా నారు నాటుకోవాలి.
అంతర కృషి : నారు నాటే ముందు ప్లూక్లోరాలిన్ 45% ఎకరాకు లీటర్ చొప్పున పిచికారీ చేసి భూమిలో కలియదున్నాలి. లేదా పెండిమిథాలిన్ 30% ఎకరాకు 1.3-1.6 లీటర్లు లేదా ఆక్సీప్లోరోపిన్ 23.5% 200 ఎం.ఎల్. చొప్పున ఏదో ఒకదానిని నాటే ముందు పిచికారీ చేయాలి. లేదా నాటిన 2, 3 రోజుల్లో తేమ ఉన్నప్పుడు ఎకరాకు ఆక్సీప్లోరోఫిన్ 23.5% 200 ఎం.ఎల్.ను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. నాటిన 30-45 రోజుల మధ్య మళ్లీ కలుపు తీసి మట్టిని ఎగదోయాలి. నారు నాటిన 75 రోజుల తర్వాత మాలిక్ హైడ్రాజైడ్ 0.25% (లీటర్ నీటికి 2.5 గ్రాములు) ద్రావణం చల్లడం వల్ల ఉల్లిగడ్డ మొలకెత్తకుండా ఉంటుంది. నారు నాటిన 100-110 రోజులకు 1 గ్రాము కార్బండిజమ్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేస్తే నిల్వలో ఉల్లిగడ్డ కుళ్లడం చాలా వరకు తగ్గుతుంది.
నేలను బాగా దున్ని 120 సెంటీమీటర్ల వెడల్పు, 3 మీటర్ల పొడవు గల ఎత్తైన నారుమళ్లను తయారు చేసుకోవాలి. 2-2.5 కిలోల విత్తనాన్ని 200-250 చదరపు మీటర్ల మడిలో పెంచిన నారు ఒక ఎకరంలో నాటడానికి సరిపోతుంది. కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బండిజమ్ + మాంకోజెబ్ను కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. నారుమడిలో విత్తనాన్ని పలుచగా వరుసలలో పోయాలి. నారుకుళ్లు తెగులు సోకకుండా పది రోజులకోసారి లీటర్ నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా మెటలాక్సిల్ + మాంకోజెబ్ 3 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయాలి. నారు పెరుగుదల దశలో రసం పీల్చే పురుగు ఆశించకుండా కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలు నారుమడిలో చల్లి నీరు పెట్టాలి.
ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువుతో పాటు 60-80 కిలోల నత్రజని, 24-32 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను వేయాలి. వేరుశనగ పిండి లేదా ఆముదపు పిండి వేసి మట్టిని ఎగదోయడం వల్ల ఎక్కువ దిగుబడి వస్తుంది. నత్రజనిని రెండు దఫాలుగా వేయాలి. నాటినప్పుడు, నాటిన 30 రోజుల తర్వాత వేసుకోవాలి. నత్రజనితో పాటు పొటాష్ రెండు దఫాలుగా వేసుకుంటే గడ్డ బాగా ఊరుతుంది.
నీటి యాజమాన్యం : నాటిన 60 రోజుల వరకు 12-15 రోజుల వ్యవధితో 4, 5 తడులు ఇవ్వాలి. గడ్డ ఊరే దశలో 6-7 రోజుల వ్యవధితో 8 తడులు ఇవ్వాలి. కోతకు 15 రోజులకు ముందు నీరు పెట్టడం ఆపివేయాలి.
ఉల్లి గడ్డ పీకడానికి ముందు నీరు కట్టడం ఆపేయాలి. ఉల్లి ఆకులను గడ్డకు 2.5 సెంటీమీటర్ల కాడ ఉంచి కోయాలి. గడ్డలు పీకిన తర్వాత వరుసలో ఉంచి ఆరబెట్టాలి. 50 శాతం ఆకులు పొలంలో రాలిన తర్వాత గడ్డలు తవ్వితే నిల్వ చేయడంలో కలిగే నష్ణాన్ని అరికట్టవచ్చు.
క్యూరింగ్ : క్యూరింగ్ వల్ల పొర రంగు అభివృద్ధి చెందుతుంది. 3, 4 రోజులు పొలం మీదే ఎండబెట్టిన తర్వాత 10-12 రోజులు నీడలో ఎండబెట్టి తర్వాత నిల్వ చేస్తే నష్టం చాలా వరకు తగ్గుతుంది. వానకాలంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండనందున సూర్యరశ్మి ద్వారా క్యూరింగ్ చేయవచ్చు. పరిపక్వం కాని, చిన్న పాయలను ఎప్పుడూ నిల్వ ఉంచరాదు. సుమారు 4-6 సెం.మీ. ఆకారం కలిగిన మధ్యస్థమైన పాయలు మంచి నిల్వ గుణం కల్గి ఉంటాయి. ఆ తర్వాత మార్కెట్కు తరలించి అమ్మకాలు చేసుకోవచ్చు.
ఉల్లిసాగుతో రైతులు యాసంగిలో అధిక దిగుబడి పొందొచ్చు. నాగర్కర్నూల్ జిల్లాలోని భూములు ఉల్లిసాగుకు అనుకూలమైన వి. ఎకరాకు 100 నుంచి 120 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. పల్లీ, ఇతర పంటలకంటే ఉల్లి సాగుచేస్తే అధిక ఆదాయం వస్తుంది.