కోటగిరి, డిసెంబర్ 18: రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తున్నది. కార్పొరేట్కు దీటుగా సర్కారు దవాఖానలో సకల వసతులు కల్పిస్తూ పేదలకు మెరుగైన వైద్య సేవలందిస్తున్నది. ఈ క్రమంలో బీపీ, మధుమేహం వ్యాధుల బారిన పేదల ఇంటికే మందులను పంపిణీ చేస్తున్నది. జిల్లా వ్యాప్తంగా 45,755 మందికి నెలకు రూ.2 వేల నుంచి రూ.3 వేల విలువైన మందుల కిట్లను ఉచితంగా అందజేయడంతో బాధితులకు సాంత్వన చేకూరుతున్నది.
45,755 మందికి లబ్ధి..
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానలో ఉన్న తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రంలో దాదాపు 50 రకాల రక్త పరీక్షలు నిర్వహించి రెండు రోజుల్లో రిపోర్టులు అందిస్తున్నారు. రిపోర్టుల ఆధారంగా బాధితులకు వైద్య సిబ్బంది ఉచితంగా మందులను పంపిణీ చేస్తున్నారు. ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు నెలనెలా బాధితుల ఇండ్లకు వెళ్లి ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న మెడిసిన్ను వారికి అందిస్తున్నారు.
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులను ప్రాథమిక దశలో కట్టడి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. నిరుపేద, మధ్యతరగతికి చెందిన వారు ప్రతినెలా మందులు కొనడం భారమవుతుండగా, వారి పరిస్థితిని గుర్తించి ఉచితంగా నెలకు సరిపడా మందులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రంగంలోకి దిగిన వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నది. ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు నెలనెలా బాధితుల ఇంటికే వెళ్లి మందుల కిట్లు పంపిణీ చేస్తున్నారు. అంతేకాదు రెగ్యులర్ పరీక్షలు చేయిస్తూ వ్యాధి తీవ్రత మేరకు మందులను మారుస్తున్నారు.
ఇంటికే వచ్చి ఇస్తున్నరు..
ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు మా గ్రామానికి వచ్చి మందు గోళీల కిట్లు ఇచ్చి, ఏ పూటకు ఏ గోళీ వేసుకోవాలో చెబుతున్నరు. కిట్లో సమయం వారీగా మందులు తీసుకునేలా అరలు ఉన్నాయి. నేను ఎవరి సాయం లేకుండానే మందులు వేసుకుంటున్న.
–మేదరి సాయమ్మ, పొతంగల్
ఉచితంగా కిట్..
జిల్లాలో 37 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 225 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయి. ముఖ్యంగా బీపీ, మధుమేహ బాధితులు నిత్యం మందులు వాడాల్సిందే. నిరుపేద, మధ్యతరగతి వారు ఖరీదైన మందులు కొనుగోలు చేయడం ఆర్థిక భారమే. ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు రక్తపరీక్షలు నిర్వహించిన తర్వాత రిపోర్టులు ఆధారంగా బాధితులకు ఉచితంగా మందుల కిట్లు అందిస్తున్నారు. వ్యాధి తీవ్రత మేరకు మెడిసిన్లు ఇస్తున్నాం.
–డాక్టర్ సుదర్శనం, డీఎంహెచ్వో, నిజామాబాద్