ఊట్కూర్, ఆగస్టు 11: మత్తు పదార్థాల నిర్మూలనకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశాల మేరకు నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో మంగళవారం ఈగల్ ఫోర్స్ బృందంతో కలిసి ప్రత్యేక శిక్షణ పొందిన నార్కోటిక్స్ స్నైపర్ పోలీసు జాగిలంతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు ఎస్సై రమేష్ తెలిపారు. నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని బస్టాండ్, పాన్షాపులు, కిరాణా దుకాణాలు, కొరియర్ కేంద్రాలు తదితర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల రవాణా, నిల్వ, విక్రయాలు, వినియోగాన్ని పూర్తిస్థాయిలో అరికట్టేందుకు పకడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తున్నామని ఎస్సై తెలిపారు.
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాల వినియోగం, రవాణా లేదా సరఫరాకు సంబంధించిన సమాచారం తెలిసిన వారు వెంటనే టోల్ఫ్రీ నంబర్ 1908 లేదా డయల్-100కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. తనిఖీల్లో ఏఎస్సై తిమ్మారెడ్డి, నార్కోటిక్స్ స్నైపర్ డాగ్ విక్కి, డాగ్ హ్యాండ్లర్ పీసీ రవి, స్థానిక పోలీసులు పాల్గొన్నారు.