జడ్చర్లటౌన్/ బాలానగర్/మిడ్జిల్/నవాబ్పేట/రాజాపూర్, ఆగస్టు 9: మొహర్రం పండుగను జడ్చర్ల పట్టణవాసులు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. మంగళవారం ముస్లింలు ప్రత్యేకంగా ఉపవాసదీక్షలు చేపట్టారు. జడ్చర్ల, బాలానగర్, మిడ్జిల్, రాజాపూర్, నవాబుపేట మండల కేంద్రాలతోపాటు అన్ని గ్రామాల్లోని మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సాయంత్రం పీర్లను పురువీధుల గుండా ఊరేగించి నిమజ్జనం చేశారు. పిల్లలు, పెద్దలు కోలాటాలు, ఆటపాటలతో డప్పుచప్పుళ్ల మధ్య పీర్ల ఊరేగింపులో పాల్గొన్నారు. మిడ్జిల్ మండలకేంద్రంతో పాటు వాడ్యాల్, మున్ననూర్ గ్రామాల్లో మొహర్రం వేడుకల్లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులతో కలసి పాల్గొన్నారు. మంగళవారం మిడ్జిల్ ఎంపీడీవో కార్యాలయం వజ్రోత్సవాల సందర్భంగా పంచాయతీ కార్యదర్శులకు ఇంటింటా జెండావిష్కరణ చేయాలని సూచించారు. అనంతరం జాతీయ జెండాలను పంపిణీ చేశారు.
వేలాదిగా తరలివచ్చిన భక్తులు
కోయిలకొండ, ఆగస్టు 9: చివరి రోజు బీబీ ఫాతిమా దర్శనానికి వేలాదిగా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకొన్నారు. సర్కార్ శక్కర ప్రభుత్వం తరఫున తాసిల్దార్ కార్యాలయం నుంచి అధికారులు సర్పంచ్, బ్రాహ్మణులు నిర్వహించారు. తరువాత బీబీ ఫాతిమా పీరును ఖిల్లా నుంచి ఊరేగింపునకు తరలించారు. సాయత్రం పీర్లు నిమజ్జనానికి తరలివెళ్లడంతో మొహర్రం ఉత్సవాలు ముగిశాయి. ఎలాంటి సంఘటనలు జరుగకుండ రూరల్ సీఐ రాజేశ్వర్గౌడ్,ఎస్సై శ్రీనయ్య ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి ప్రత్యేక పూజలు
బీబీ ఫాతీమా మొహర్రం ఉత్సవాల్లో ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి పాల్గొని బీబీ ఫాతీమా పీరును దర్శించుకొన్నారు. భీమమ్మ అనుగ్రహంతో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలని పూజలు నిర్వహించారు.
ఘనంగా వేడుకలు
మహ్మదాబాద్/మూసాపేట(అడ్డాకుల)/భూత్పూర్, ఆగస్టు 9: ఉమ్మడి మహ్మదాబాద్ మండలంలో పీర్ల పండుగ ఘనంగా నిర్వహించారు. దేవరకద్ర మండలంలోని రాచాల, పొన్నకల్ గ్రామాల్లో మంగళవారం మొహర్రం వేడుకల్లో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. భూత్పూర్ మండల వ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో వేడుకలు నిర్వహించారు.