వైద్యురాలు ప్రతిభకు అభినందనల వెల్లువ
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూన్ 24 : మెంబర్స్ ఆఫ్ రాయల్ కాలేజీ ఆఫ్ ఒబెస్ట్రెసియాన్స్, గైనకాలజిస్టు లండన్ వారు నిర్వహించిన పోటీ పరీక్షల్లో రాష్ట్రం నుంచి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన డాక్టర్ పి.ప్రతిభ ఉత్తీర్ణత సాధించడం గర్వకారణమని పాలమూరు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సంపత్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని న్యూటౌన్లో ఉన్న సుశ్రుత ప్రజా వైద్యశాలలో డాక్టర్ ప్రతిభను శుక్రవారం ఐఎంఏ, జిల్లాలోని ప్రముఖ వైద్యులు సన్మానించారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యుడు మహేశ్బాబు మాట్లాడుతూ లండన్లో నిర్వహించిన పరీక్షలో ఉమ్మడి జిల్లా నుంచి డాక్టర్ ప్రతిభ మొట్టమొదటిసారిగా ఉతీర్ణత సాధించడం గొప్పవిషమయన్నారు. ప్రతి 20 ఏండ్లకోసారి వైద్య సేవల్లో మార్పులు వస్తున్నాయన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలందించేందుకు ఈ డిగ్రీ ఉపయోగపడుతుందన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ ప్రతిభ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో 25 ఏండ్లుగా వైద్యసేవలందిస్తున్నానన్నారు. ఇంకా మెరుగైన సేవలందించాలని అంతర్జాతీయ వైద్యులతో పోటీ పడి చదివానన్నారు. కరోనా కాలంలో ఎంఆర్సీవోజీ డిగ్రీ పరీక్షల కోసం చాలా కష్టపడి ప్రిపేరయ్యానని చెప్పారు. రోగులకు కొత్త రకం పద్ధతులతోపాటు మెరుగైన సేవల కోసం ఈ డిగ్రీతో అవగాహన వచ్చిందన్నారు. ఉన్నతమైన ప్రమాణాలతో రోగులకు వైద్యసేవలందిస్తానన్నారు. అంతర్జాతీయ స్థాయిలో మన రాష్ర్టానికి, జిల్లాకు పేరు తీసుకురావడం గర్వకారణంగా ఉందన్నారు. కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు విజయ్కాంత్, డాక్టర్ కవితా రెడ్డి, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.