తెలకపల్లి, డిసెంబర్ 5: ‘గుడ్ మార్నింగ్ నాగర్కర్నూల్’ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నది. సమస్యల పరిష్కారానికి నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి నడుంబిగించి ఇంటింటికీ వెళ్లి సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తున్నారు. తెలకపల్లి మండలం పర్వతాపూర్లో సోమవారం ‘గుడ్ మార్నింగ్ నాగర్కర్నూల్’ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి గడపగడపకూ వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రేషన్, ఆసరా, పింఛన్లు సక్రమంగా అందుతున్నాయా.. లేదా అని గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ధరణిలో ఉండే సమస్యలను అధికారులకు తెలిపి పరిష్కరించుకోవాలన్నారు. అర్హులైన వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామన్నారు.
గతంలో తమ సమస్యలు తీర్చాలని అధికారుల చుట్టూ తిరిగినా పరిష్కారం కాలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడ్డాక టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రజాప్రతినిధులకు, టీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. ఎమ్మెల్యే వెంట డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ హనుమంతరావు, పార్టీ మండల అధ్యక్షుడు నరేందర్రెడ్డి, ఎంపీపీ మధు, సింగిల్విండో చైర్మన్ భాస్కర్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మాధవరెడ్డి, సర్పంచ్ లక్ష్మమ్మ, ఎంపీటీసీ శివారెడ్డి, రమేశ్, మాజీ ఎంపీపీ పర్వతాలు, విండో డైరెక్టర్ రాజమహేందర్రెడ్డి, పార్టీ మండల ప్రధానకార్యదర్శి శ్రీనివాసులు, నాయకులు బంగారయ్య తదితరులు పాల్గొన్నారు.