నాగర్కర్నూల్, సెప్టెంబర్ 30(నమస్తే తెలంగాణ): “పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేస్తామని గత ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. కృష్ణానీళ్లలో వాటా తేల్చరు. పాలమూరు, కాళేశ్వరం ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వరు. తెలంగాణపై అక్కసు కక్కుతారు. తెలంగాణలో ఓట్లు, సీట్లు కావాలి కానీ అభివృద్ధి పట్టదా” అని ప్రధాని మోదీపై నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ధ్వజమెత్తారు. తిమ్మాజిపేట మండలం పోతురెడ్డిపల్లిలో పదేండ్ల ప్రజాప్రస్థానం యాత్రలో భాగంగా విలేకరులతో మాట్లాడారు. ఒకప్పుడు పాలమూరు జిల్లా వలసలకు కేరాఫ్గా నిలిస్తే.. ఇప్పుడు అభివృద్ధికి కేరాఫ్గా మారిందన్నారు. పదేండ్ల కింద పల్లెల్లోకి ఎమ్మెల్యేలు వెళ్తే ఖాళీ బిందెలతో నిరసనలు తెలిపే మహిళలు ఇప్పుడు పూలమాలలు, బోనాలు, మంగళహారతులతో ఆహ్వానిస్తున్నారన్నారు.
సీఎం కేసీఆర్ పట్టుదలతో పెండింగ్ ప్రాజెక్టులతోపాటు పీఆర్ఎల్ఐ, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు పూర్తి చేశామన్నారు. గత నాయకులు తెలంగాణ, పాలమూరు పేరు చెప్పుకొని ఓట్లు, సీట్లు పొందారే తప్పా చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. గతంలో పీఆర్ఎల్ఐ ప్రాజెక్టును పూర్తి చేస్తానన్న మోదీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. ఇంకా ఎన్జీటీ, సుప్రీంకోర్టుల్లో కేసులతో పనుల జాప్యానికి కారకులయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ మొఖం పెట్టుకొని పాలమూరు వస్తున్నారో మోదీ ప్రజలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గుజరాత్పై ఉన్న ప్రేమ తెలంగాణపై లేదని దుయ్యబట్టారు. తెలంగాణ ఏర్పాటుపై కూడా ప్రధాని అక్కసు వెళ్లగక్కడం హేయమన్నారు. బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే పాలమూరు, కాళేశ్వరం ప్రాజెక్టులకు జాతీయ హోదా ప్రకటింపజేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణపై విషం కక్కే బీజేపీకి ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. కావేరీ జలాల వివాదంలో తమిళనాడు, కర్ణాటకలో రాజకీయ పార్టీలు ఒక్కటైతే తెలంగాణలో మాత్రం కాంగ్రెస్, బీజేపీలు పదవుల కోసం పాకులాడుతున్నాయని విమర్శించారు. ఇక్కడి ప్రతిపక్షాల నాయకులకు శ్రీశైలం, జూరాల ప్రాజెక్టుల నీటిసామర్థ్యం తెలియదని, ప్రాజెక్టు ఎక్కడ కడితే ఎంత ప్రయోజనమో కనీస అవగాహన లేదన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలుసని, ప్రతిపక్షాలకు మళ్లీ అరణ్యవాసం తప్పదని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి పట్టని పార్టీలకు ఓట్లు, సీట్లు ఎందుకని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు మళ్లీ బీఆర్ఎస్కే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. తన యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్, ప్రజల అండతో తాను హ్యాట్రిక్ విజయం సాధిస్తానన్నారు. సమావేశంలో డీసీసీబీ డైరెక్టర్ రఘునందన్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్యాదవ్, నాయకులు వేణుగోపాల్గౌడ్, ప్రదీప్, విజయ్, కుర్మయ్య, వెంకటస్వామి, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.