గద్వాల/గద్వాలటౌన్, ఫిబ్రవరి 22 : భూదేవి.. శ్రీదేవీతో కలిసి కల్యాణవేదికపై చెన్నకేశవుడు పెండ్లికొడుకై కొలువు దీరగా.. వేద పండితుల మంత్రోచ్ఛారణలు.. మేళతాళాల మధ్య ఇరువురు భామల మెడలో చెన్నకేవశస్వామి మాంగళ్యధారణ చేయగా.. భక్తజనం పులకించిపోయారు.. దీంతో గద్వాల కోట మొత్తం గోవింద నామస్మరణతో మార్మోగింది. జిల్లా కేంద్రంలోని గద్వాల కోటలో కొలువు దీరిన భూలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారి కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
కల్యాణానికి ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, బండ్ల జ్యోతి దంపతులు హాజరై స్వామి, అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. అనంతరం అర్చకులు వెంకటేశాచారి, రాఘవేంద్రచారి ఆధ్వర్యంలో శాస్ర్తోక్తంగా కల్యాణాన్ని నిర్వహించగా వేలాది మంది భక్తులు స్వామివారి కల్యాణాన్ని తిలకించి తన్మయత్వం పొందారు. అనంతరం స్వామి, అమ్మవారిని మయూరి వాహనంపై ఊరేగించారు. ఈ సందర్భంగా విజితాగౌడ్ కళా బృందం ఆలపించిన అన్నమయ్య, వేంకటేశ్వరస్వామి సంకీర్తనలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, పట్టణ ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీ నాయకులు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.